Modi Putin : జెలెన్స్కీతో మీరే నేరుగా మాట్లాడి వివాదాన్ని ముగించండి- పుతిన్ను కోరిన మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. జెలెన్ స్కీతో నేరుగా చర్చలు జరపాలని, వివాదాన్ని ముగించాలని..
Modi Putin : యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తోనూ ఫోన్ లో మాట్లాడారు. దాదాపు 50 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. యుక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. యుక్రెయిన్, రష్యా మధ్య చర్చల స్థితిగతులపై ప్రధాని మోదీకి పుతిన్ వివరించారు.(Modi Putin)
ఈ సందర్భంగా పుతిన్ కు కీలక విన్నపం చేశారు ప్రధాని మోదీ. ప్రస్తుతం జరగబోయే రష్యా, యుక్రెయిన్ చర్చలకు అదనంగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో నేరుగా చర్చలు జరపాలని, వివాదాన్ని ముగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను కోరారు ప్రధాని మోదీ. అలాగే సుమీతో సహా యుక్రెయిన్లోని కొన్ని ప్రాంతాల్లో కాల్పుల విరమణ ప్రకటించడం, మానవతా కారిడార్ల ఏర్పాటు చేయడం పట్ల రష్యాను ప్రధాని మోదీ అభినందించారు. ఇక సుమీ నగరంలో చిక్కుకున్న భారతీయ పౌరులను వీలైనంత త్వరగా, సురక్షితంగా తరలించడం యొక్క ప్రాముఖ్యతను పుతిన్ కు నొక్కి చెప్పారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో భారతీయుల తరలింపునకు అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రధాని మోదీకి పుతిన్ భరోసా ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతోనూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. దాదాపు 35 నిమిషాల పాటు ఇరువురి మధ్య సంభాషణ కొనసాగింది. యుక్రెయిన్ నుంచి 20వేల మందికిపైగా భారత పౌరుల తరలింపులో సాయం పట్ల జెలెన్ స్కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
Russia Ukraine War: యుక్రెయిన్ దారులన్నీ క్లోజ్.. చుట్టుముట్టేస్తున్న రష్యన్ ఆర్మీ..!
ఇప్పటికీ కొందరు భారత పౌరులు యుక్రెయిన్లోనే ఉండడంతో భారత పౌరుల తరలింపులో నిరంతరం సహకారం ఉండాలని మోదీ కోరారు. యుక్రెయిన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మోదీకి జెలెన్ స్కీ వివరించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రతక్ష చర్చలు జరుగుతున్న తీరును మోదీ అభినందించారు. దౌత్య మార్గాల్లో శాంతియుతంగా చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలని జెలెన్ స్కీకి ప్రధాని మోదీ సూచించారు.
హింసను తక్షణమే నిలిపివేయాలని పునరుద్ఘాటించిన మోదీ… శాంతియుతంగా చర్చల ద్వారా రెండు దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలని జెలెన్ స్కీకి సూచించారు మోదీ. యుక్రెయిన్లో ఇంకా మిగిలున్న భారతీయ విద్యార్థుల భద్రత పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మోదీ… వారిని సురక్షితంగా తరలించాలని జెలెన్ స్కీని కోరారు.
యుక్రెయిన్ పై గత 12 రోజులుగా దాడులు జరుపుతున్న రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ వినతి మేరకు రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. రెడ్ క్రాస్ వాహనాలు ఏర్పాటు చేసి యుక్రెయిన్లోని విదేశీయులను తరలించాలని ప్రయత్నాలు జరుపుతోంది.
ఈ నేపథ్యంలో కారిడార్ ఏర్పాటు కోసం రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినట్లు రష్యా మీడియా తెలిపింది. మరోవైపు, యుక్రెయిన్-రష్యా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఆ రెండు దేశాలు రెండు దశల్లో చర్చలు జరిపినప్పటికీ విఫలమైన విషయం తెలిసిందే. దీంతో మూడో విడత చర్చలు జరుగుతున్నాయి.