Afghanistan : కాబూల్ రాకెట్ దాడిలో ఆరుగురు మృతి..అమెరికా వైమానిక దాడి!
అప్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నాం జరిగిన రాకెట్ దాడిలో ఇప్పటివరకు ఆరుగరు మరణించినట్లు సమాచారం.
Afghanistan అప్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని గులై ఏరియాలో ఆదివారం మధ్యాహ్నాం జరిగిన రాకెట్ దాడిలో ఇప్పటివరకు ఆరుగురు మరణించినట్లు సమాచారం. మరణించినవారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక,ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.
స్థానిక వార్తా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం మధ్యాహ్నాం ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఓ ఇంటిపై..ఒక రాకెట్ కూలిపోయి పేలుడు సంభవించింది. కాగా కాబుల్లో ఉగ్రదాదులు మరోసారి దాడి చేస్తారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు. అయితే ఈ దాడి వెనుక ఐసిస్ హస్తమున్నట్లు అనుమానిస్తున్నారు.
ఇక,కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద గురవారం ఐసిస్-కే జరిపిన జంట ఆత్మాహుతి దాడుల్లో 160కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13మంది అమెరికా సైనికులు ఉన్నారు. కాబుల్లో నాలుగు రోజుల వ్యవధిలో మూడు పేలుళ్లు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు, కాబుల్లోనే అమెరికా ఆదివారం వైమానిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. కాబుల్ విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడి చేసేందుకు వెళ్తున్న ఓ ఉగ్రవాది వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం ఈ దాడి జరిపినట్లు సమాచారం.అయితే కాబుల్ సమీపంలో జరిగిన రాకెట్ దాడి, అమెరికా వైమానిక దాడి ఘటనలు వేరు వేరు అని తెలుస్తున్నప్పటికీ.. వీటిపై పూర్తిస్థాయిలో సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.