Delhi : మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల చేయనున్న సీఈసీ
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించనుంది.
presidential election schedule to be announced : రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈరోజు (జూన్ 9,2022) మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. 2017, జులై 25న రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి వ్యక్తి రామ్నాథ్ కోవిందే.
రాష్ట్రపతి ఎన్నికల కోసం ఈసారి 776 మంది ఎంపీలు, 4120 ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. మొత్తం ఓట్ల విలువ 10,98,903గా ఉండబోతుండగా.. అందులో ఎంపీ ఓటు విలువ 708గా ఉంది. అత్యధికంగా యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉండనుంది.
తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బిజెపికి నాలుగైదు శాతం ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని కాంగ్రెసేతర రాజకీయ పార్టీల మద్దతుతో తమ అభ్యర్థిని సునాయాసంగా గెలిపించుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఓడిశాలోని బిజెడి, ఆంధ్ర ప్రదేశ్ లోని వైసిపి వంటి పార్టీల మద్దతు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ నాయకులు ఆయా పార్టీలను సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవి కాలం సహితం ఆగష్టులో పూర్తి కానున్న క్రమంలో బీజేపీ ఆయనకు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఇస్తుందో లేదో చూడాలి.