Lakhimpur Violence : కేంద్రమంత్రిని డిస్మిస్ చేయాలన్న కాంగ్రెస్..ప్రభుత్వంతో మాట్లాడతానన్న రాష్ట్రపతి
లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఇవాళ(అక్టోబర్-13,2021)రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసింది.
Lakhimpur Violence లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఇవాళ(అక్టోబర్-13,2021)రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందంలో రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ నేత చౌదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్,గులాం నబీ అజాద్, ఏకే ఆంటోనీ ఉన్నారు. లఖింపూర్ హింసాకాండపై పూర్తి వివరాలతో ‘మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్’ పేరిట ఓ వినతిపత్రాన్ని రాష్ట్రపతికి కాంగ్రెస్ బృందం సమర్పించింది.
రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ… లఖింపూర్ ఘటనపై ఇద్దరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాం. లఖింపుర్ ఖేరి ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడుగా ఉన్న నేపథ్యంలో… అజయ్ మిశ్రాను తన పదవి నుంచి తొలగించాలని,అప్పుడే నిష్పాక్షిక విచారణ సాధ్యమవుతుందని రాష్ట్రపతికి వివరించామని రాహుల్ తెలిపారు.
ప్రియాంకగాంధీ మాట్లాడుతూ…లఖింపూర్ ఘటనపై ప్రభుత్వంతో ఈరోజే చర్చిస్తానని రాష్ట్రపతి తమకు హామీ ఇచ్చారని తెలిపారు.
కాగా, అకోబరు 3,2021న లఖింపూర్ ఖేరి జిల్లాలోని టికోనియా-బన్బీపుర్ రహదారిపై నూత వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారు, మరో వాహనం దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించగా.. అనంతరం జరిగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆశిష్ మిశ్రాను ఉత్తర్ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు బీజేపీ కార్యకర్తలను కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు.
ALSO READ ట్రంప్కు సౌదీ రాజ కుటుంబం ఇచ్చిన గిఫ్ట్స్ ఫేక్!