India’s Covid-19 Deaths : భారత్ లో కరోనా మరణాలు..ప్రభుత్వ లెక్కల కంటే పది రెట్లు అధికం

భారత్ ​లో కోవిడ్ కాలంలో సంభవించిన మరణాల సంఖ్యపై ఓ అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. 

India’s Covid-19 Deaths : భారత్ లో కరోనా మరణాలు..ప్రభుత్వ లెక్కల కంటే పది రెట్లు అధికం

Covid Deaths

India’s Covid-19 Deaths భారత్ ​లో కోవిడ్ కాలంలో సంభవించిన మరణాల సంఖ్యపై ఓ అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.  కరోనా సమయంలో మృతుల సంఖ్య..ప్రభుత్వం చెప్పే లెక్కకు 10 రెట్లు అధికంగా ఉంటుందని అమెరికాకి చెందిన రీసెర్చ్ గ్రూప్ సెంటర్​ ఫర్​ గ్లోబల్​ డెవలప్​మెంట్ మంగళవారం ఓ అధ్యయనంలో తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం.. భారత్​లో ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 4లక్షల 14వేలకు పైగా ఉంది. కానీ కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి అసలు సంఖ్య ఇందుకు 10 రెట్లు ఉంటుందని మంగళవారం విడుదల అధ్యయనంలో సెంటర్​ ఫర్​ గ్లోబల్​ డెవలప్​మెంట్ అంచనా వేసింది. భారత్ లో కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వం చెప్పిన లెక్కలకు, వాస్తవ గణాంకాలకు మధ్య కనీసం 34 లక్షల నుంచి 47 లక్షల మేర తేడా ఉంటుందని నివేదికలో తెలిపారు.

జూన్ 21 వరకు భారత్‌ లో సంభవించిన అదనపు మరణాలను అంచనా వేసేందుకు మూడు భిన్న సమాచార వనరులను అధ్యయనంలో ఉపయోగించారు . అందులో మొదటగా.. దేశ జనాభాలో సగం వాటాను కలిగిన ఏడు రాష్ట్రాల్లోని జనన, మరణాల నమోదును పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు. భారత్​ లో కరోనా ఆనవాళ్లు ఉన్న రక్త పరీక్షల ఫలితాలు, ప్రపంచవ్యాప్తంగా మరణాల రేట్లను రెండో విధానంగా తీసుకున్నారు. ఏడాదిలో రెండు సార్లు జరిగే ఆర్థిక సర్వేలో పాల్గొన్న 9 లక్షల మంది వివరాలను పరిశీలించారు. గత నాలుగు నెలల కాలంలో ఆయా కుటుంబాలలో ఎవరైనా కరోనాతో మరణించారా అనే విషయాలను సేకరించారు. వీటిన్నింటినీ పరిశీలించిన అనంతరం భారత్‌లో ప్రభుత్వం చెప్పిన లెక్కలకంటే అదనపు మరణాలు 34 లక్షల నుంచి 47 లక్షల వరకు ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు. భారత్​లో మరణాల అసలు లెక్క మిలియన్లలో ఉంటుందని.. స్వతంత్ర భారత దేశ చరిత్రలో అతిపెద్ద మానవ విషాదం కరోనానే అని నివేదికలో పేర్కొన్నారు.

అయితే కొవిడ్‌తోనే 40లక్షల మంది చనిపోయారని చెప్పలేమని ఈ అధ్యయనం యొక్క ఆథర్స్ లో ఒకరైన కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. కొవిడ్ వాస్తవ మరణాలు ఎన్ని అని.. కచ్చితంగా అంచనా వేయడం కష్టసాధ్యమన్నారు. అయితే మహమ్మారి తీవ్రతను అదనపు మరణాలు తెలియజేస్తాయని స్పష్టం చేశారు. కాగా, కరోనా మరణాల సంఖ్య వాస్తవ లెక్కలకంటే తక్కువగా ఉందని గతంలోనూ ఇలాంటి వాదనలే వినిపించగా.. కేంద్రం వాటిని తోసిపుచ్చిన విషయం తెలిసిందే.