IndVsEng 3rd T20I : వాటే బ్యాటింగ్.. సూర్యకుమార్ యాదవ్ సెంచరీ

IndVsEng 3rd T20I : వాటే బ్యాటింగ్.. సూర్యకుమార్ యాదవ్ సెంచరీ

Suryakumar Yadav

IndVsEng 3rd T20I : ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్టేజ్ లో క్రీజ్ లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ సూపర్బ్ గా బ్యాటింగ్ చేశాడు. ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగు పెట్టించాడు. ఈ క్రమంలో సెంచరీతో కదం తొక్కాడు.

కేవలం 48 బంతుల్లోనే యాదవ్ శతకం సాధించడం విశేషం. అతడి స్కోర్ లో 12 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. యాదవ్ ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 16వ ఓవర్ లో విల్లే వేసిన మూడో బంతిని బౌండరీ కొట్టి శతకం పూర్తి చేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. సెంచరీతో టీ20ల్లో ఈ ఘనత సాధించిన ఐదో బ్యాట్స్‌మన్‌గా యాదవ్ రికార్డులకెక్కాడు. తొలుత 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సూర్యకుమార్ యాదవ్.. హాఫ్ సెంచరీ తర్వాత మరింతగా చెలరేగాడు. మరో 16 బంతుల్లోనే 50 పరుగులు చేయడం విశేషం.

216 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. 5 ఓవర్లలో 31 పరుగులకే మూడు వికెట్లు (పంత్, కోహ్లి, రోహిత్ శర్మ) కోల్పోయి కష్టాల్లో పడింది. టోప్లే వేసిన ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (11) చివరి బంతికి కూడా బౌండరీ కొట్టబోయి ఫిలిప్‌ సాల్ట్‌ చేతికి చిక్కాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు.