Suvendu Adhikari : నందిగ్రామ్ లో సీఎం మమతని ఓడించిన సువెందు అధికారి
Mamata Banerjee ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్లో చివరకు సువెందు అధికారి విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. టీఎంసీ అభ్యంతరంతో రీకౌంటింగ్ చేశామని.. సువెందు 1736 ఓట్ల తేడాతో దీదీపై గెలిచారని ఈసీ ప్రకటించింది.
నందిగ్రామ్ లో తనను ఓడించేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర చేసిందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నందిగ్రామ్ ఎన్నికపై సుప్రీంకోర్టుకెళ్తానని మమత ప్రకటించారు. తాను ఓటమిని పట్టించుకోనన్నారు. నందిగ్రామ్ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానన్నారు.
కాగా, ఎన్నో ఏళ్లుగా నందిగ్రామ్..సువెందు అధికారి కుటుంబానికి పెట్టని కోటగా ఉంది. మమతకు సన్నిహితంగా ఉన్న సువేందు అధికారి ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్లారు. అయితే మమత ఆయనపైనే పోటీ దిగుతానని పట్టుబట్టి బరిలోకి దిగారు. చివరికి సువెందు అధికారిపై పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మమతని 50వేల ఓట్ల మెజార్టీతో ఓడించకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సువెందు గతంలో శపథం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు, మొత్తం 294 స్థానాలకు గాను..215స్థానాల్లో ఘనవిజయం సాధించింది టీఎంసీ. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కుంచుకోవాలనుకున్న బీజేపీ..కేవలం 76స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో ముచ్చటగా మూడోసారి సీఎం పగ్గాలు చేపట్టనున్నారు మమతాబెనర్ఝీ.