Suresh Raina : నెట్స్లో కఠిన బౌలర్ అతడే.. ఔటైయ్యామా.. నెలరోజులు అతడి పక్కన కూర్చోలేం
టీమ్ఇండియా, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన సురేశ్ రైనా పరుగుల వరద పారించాడు. ఎందరో బౌలర్లకు నిద్రలేని రాత్రుళ్లు మిగిల్చాడు. అలాంటి రైనా కు కూడా ఓ బౌలర్ అంటే భయం అట. నెట్స్లో అతడిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాడట.
![Suresh Raina : నెట్స్లో కఠిన బౌలర్ అతడే.. ఔటైయ్యామా.. నెలరోజులు అతడి పక్కన కూర్చోలేం Suresh Raina : నెట్స్లో కఠిన బౌలర్ అతడే.. ఔటైయ్యామా.. నెలరోజులు అతడి పక్కన కూర్చోలేం](https://10tv.in/wp-content/uploads/2023/06/Suresh-Raina-MS-Dhoni.jpg)
Suresh Raina-MS Dhoni
Suresh Raina-MS Dhoni : టీమ్ఇండియా, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన సురేశ్ రైనా (Suresh Raina) పరుగుల వరద పారించాడు. ఎందరో బౌలర్లకు నిద్రలేని రాత్రుళ్లు మిగిల్చాడు. అలాంటి రైనా కు కూడా ఓ బౌలర్ అంటే భయం అట. నెట్స్లో అతడిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాడట. ఆ బౌలర్ మురళీ ధరనో, లసిత్ మలింగనో అనుకుంటే మీరు పొరబడినట్లే. అతడు మరెవరో కాదు. టీమ్ఇండియాకు రెండు ప్రపంచ కప్లు అందించిన మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni).
అవును ఇది నిజమే. నెట్స్లో మహేంద్ర సింగ్ ధోని ని ఎదుర్కొనేందుకు తాను ఇబ్బంది పడినట్లు రైనా చెప్పాడు. ధోని, రైనా తాము ఆడే రోజుల్లో టీమ్ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ కు కలిసి ఆడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం నెలకొంది. తాజాగా జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా మాట్లాడుతూ నెట్స్లో ధోని బౌలింగ్లో ఇబ్బంది పడినట్లు చెప్పాడు.
ప్రాక్టీస్ చేసే సమయంలో మురళీధరన్, మలింగా బౌలింగ్లో పెద్దగా ఇబ్బంది పడలేదు. అయితే.. ధోని బౌలింగ్లో మాత్రం ఇబ్బంది పడ్డాను. ఒకవేళ ధోని కనుక మిమ్మల్ని ఔట్ చేసినట్లయితే మీరు ఓ నెల రోజుల పాటు అతడి పక్కన కూర్చోలేరు. ఎందుకంటే ధోనిని కలిసిన ప్రతిసారీ అతడు మనల్ని ఎలా ఔట్ చేశాడు అన్న విషయాన్ని పదే పదే గుర్తుచేస్తుంటాడు అని రైనా చెప్పాడు.
ఆఫ్స్పిన్, మీడియం పేస్, లెగ్ స్పిన్ ఇలా ఏదైనా సరే మహి వేయగలడు. ఫ్రంట్ ఫుట్ నో బాల్స్ వేసినా సమర్ధించుకోగలడు. ఓ సారి ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో బౌలింగ్ చేసి బాల్తో అద్భుతంగా స్వింగ్ రాబట్టాడని రైనా నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు.
ధోని తన కెరీర్లో 90 టెస్టులు ఆడాడు. 96 బంతులు మాత్రమే వేశాడు. 350 వన్డే మ్యాచుల్లో ఆరు ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ తీసుకున్నాడు. ఇక టీ20ల్లో మాత్రం ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు.
ఇదిలా ఉంటే.. సురేశ్ రైనా భారత జట్టు తరుపున 18 టెస్టుల్లో ఓ శతకం, 7 అర్థశతకాలతో 768 పరుగులు, 226 వన్డేల్లో 5 సెంచరీలు, 36 అర్ధశతకాలతో 5,615 పరుగులు, 78 టీ20ల్లో ఓ సెంచరీ 5 అర్ధశతకాలతో 1,605 పరుగులు చేశాడు. 15 ఆగస్టు 2020న రైనా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్లో 200 మ్యాచులు ఆడి ఓ సెంచరీ 39 అర్ధశతకాలతో 5,528 పరుగులు చేశాడు.
ICC World Cup 2023 : ఒకవేళ పాకిస్థాన్ సెమీఫైనల్కు వస్తే.. జరిగేది ఇదే..