PM Modi Warangal tour: తెలంగాణను అవినీతిమయం చేశారు.. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి ఢిల్లీ వరకు పాకింది.. ప్రధాని మోదీ.. Live Updates
ప్రధాని నరేంద్ర మోదీ ఓరుగల్లులో పర్యటించారు. హనమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు చేశారు.
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ జిల్లాలో పర్యటించారు. కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ, పీవోహెచ్ లకు, జాతీయ రహదారులతో కలిసి మొత్తం రూ.6,109 కోట్ల అభివృద్ధి పనులకు సభా వేదిక నుంచి ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
LIVE NEWS & UPDATES
-
మరోసారి ఆ రెండు పార్టీలను నమ్మి మోసపోవద్దు..
దేశంలో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతిని జనం చూశారు. వారి విషయంలో జాగ్రత్త పడకపోతే తెలంగాణ నష్టపోతుంది. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చేది బీజేపీ మాత్రమే. బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది అని ప్రధాని మోదీ అన్నారు.
-
కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి ..
వరంగల్ విజయ సంకల్ప్ సభలో కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్గా ప్రధాని మోదీ విమర్శలు చేశారు. కేసీఆర్ పాలన అవినీతిమయం అయిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నో పోరాటల తర్వాత సాధించిన తెలంగాణ అభివృద్ధిని నాశనం చేశారు. కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు పాకింది. అభివృద్ధికోసం కొన్ని రాష్ట్రాలు కలిసి పనిచేస్తుంటాయి. తొలిసారిగా రెండు రాష్ట్రాలు (ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు) అవినీతి కోసం కలిసి పనిచేయడం దౌర్భాగ్యం. కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాయని మోదీ చెప్పారు.
-
కేసీఆర్ సర్కార్పై మోదీ ఫైర్ ..
కేసీఆర్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రధాని మాట్లాడుతూ.. భద్రాకాళీ మహాత్వం, సమక్క - సారమ్మ పౌరుషానికి వరంగల్ ప్రతీక. ఇలాంటి నగరానికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఒక బీజేపీ కార్యకర్తగా మీ మధ్యకు వచ్చాను అని అన్నారు. తెలంగాణను బీఆర్ఎస్ నేతలు అవినీతి మయం చేశారు. అవినీతి లేని ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. కేసీఆర్ సర్కార్ ఊహించలేనంత అవినీతికి పాల్పడిందని ప్రధాని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చింది, ఇంటికో ఉద్యోగం ఇస్తామని అన్నారు. అన్ని పగి కలలుగానే మిగిపోయాయి. తొమ్మిదేళ్లు అవుతుంది.. ఏమైంది మీ హామీ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ స్కాం గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తోంది? కేసీఆర్ సర్కార్ ఆ ఉద్యోగాలను తెలంగాణ నేతల జేబులు నింపుకోవడానికి వాడుకున్నారు. ఇది విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ చేస్తున్న ద్రోహం కాదా అని మోదీ ప్రశ్నించారు.
-
ఈటల రాజేందర్ ప్రసంగం..
- తెలంగాణకు భరోసాగా ఉన్నామని చెప్పేందుకు మోదీ వచ్చారు.
- ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలకు శుభసూచికం.
- వరంగల్ గడ్డమీద రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టాం.
- తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను గద్దె దించాలని కోరుకుంటున్నారు.
- ఇందుకు బీజేపీ సహకారం అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
- తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాల్సిందే.
- వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేది బీజేపీనే.
- హామీలు ఇచ్చి ప్రజల కళ్లలో మట్టికొట్టిన కేసీఆర్ ను ఓడించాలి.
- బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్ మాటలు చెప్పారు.
- బంగారు తెలంగాణ చేతల్లో చేసి చూపించే సత్తా బీజేపీకే ఉంది.
- బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కానేకాదు.
- బీజేపీపై దుష్ర్పచారం చేస్తున్నారు.
-
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం..
- తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
- తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు.
- తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయింది.
- గత తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం, మౌలిక వసతుల కల్పనకు ఎంతో కేంద్రం కృషి చేసింది.
- తెలంగాణ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది..
- తెలంగాణలో కనెక్టవిటి, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రూ. 6వేల కోట్లు ఖర్చు చేశాం.
- దేశం అభివృద్ధిలో తెలుగు వారి ప్రతిభ కీలకం.
- దేశానికి ఇది స్వర్ణ సమయం.
- దేశాభివృద్ధికోసం శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నాం.
- అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం.
- హైవేలు, ఎక్స్ప్రెస్వేలు, ఇండస్ట్రియల్ - ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం.
- తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రదాలున్నాయి.
- కరీంగనర్ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుంది.
- రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాం.
- తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నాం.
-
అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన ..
- సభా వేదికపైనుంచి రూ.6,100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.
- రూ. 521 కోట్లతో రైల్వే వ్యాగన్ మ్యాను ఫాక్చరింగ్ యూనిట్ కు శంకుస్థాపన చేసిన మోదీ
- జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా ఎన్-163జీ కి శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ.
- రూ. 2,147 కోట్లతో జగిత్యాల - కరీంనగర్ - వరంగల్ ఎన్హెచ్ పనులకు శంకుస్థాపన
- రూ. 3,441 కోట్లతో మంచిర్యాల - వరంగల్ ఎన్హెచ్ పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.
-
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..
- కేంద్రం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తోంది.
- గతిశక్తి యోజన ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
- తెలంగాణలో రూ.1.10 లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి.
- 2024 కల్లా తెలంగాణలో 2లక్షల కోట్లు ఖర్చు చేస్తాం.
-
కిషన్ రెడ్డి మాట్లాడుతూ..
ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు కేంద్రం అండగా నిలిచిందని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జాతీయ రహదారులకు కృషి చేశామని, తొమ్మిదేళ్లలో రహదారుల కోసం ఎన్నో కోట్లు ఖర్చు చేశామని అన్నారు. తెలంగాణకు కేంద్రం రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కేటాయించింది. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ కేటాయించామని కిషన్ రెడ్డి అన్నారు.
-
ప్రధాని మోదీకి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిమను అందించిన కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి.
-
ప్రధాని నరేంద్ర మోదీ హనమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న విజయసంకల్ప సభలో పాల్గొన్నారు.
-
భద్రకాళి ఆలయం నుంచి విజయసంకల్ప సభకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ.
-
భద్రకాళి ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
-
గోశాలలో గోసేవలో ప్రధాని మోదీ..
వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ. ఆలయంలో గోశాలలో గోసేవలో పాల్గొన్న మోదీ. గోసేవ అనంతరం ప్రత్యేక పూజలు. ఆశీర్వచనాలు అందించిన అర్చకులు.
-
భద్రకాళి ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
ప్రధాని నరేంద్ర మోదీ భద్రకాళి ఆలయంకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు మోదీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భద్రకాళి అమ్మవారికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
-
వరంగల్ చేరుకున్న ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ చేరుకున్నారు. ఏంఐ ప్రత్యేక విమానం ద్వారా మామునూరుకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో భద్రకాళీ అమ్మవారిని మోదీ దర్శించుకుంటారు. ఆలయంలో 15 నిమిషాల పాటు ప్రత్యేక పూజల్లో పాల్గోనున్న మోదీ.
-
మోదీకి ఘన స్వాగతం..
హకీంపేట్ ఎయిర్ పోర్టు వద్ద ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన గవర్నర్ తమిళ్ సై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఏంఐ ప్రత్యేక విమానంలో వరంగల్కు బయలుదేరిన ప్రధాని మోదీ.. వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత.. రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కి భూమి పూజ చేయనున్న మోదీ. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న మోదీ. అనంతరం హనుమకొండలో ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ఫ్ సభ లో పాల్గొని ప్రసంగించనున్న ప్రధాని
-
హకీంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ప్రధాని మోదీ వరంగల్కు బయలుదేరారు.
-
మరికొద్ది సేపట్లో వరంగల్కు ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ హకీంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. హకీంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో మరికొద్ది సేపట్లో వరంగల్ కు చేరుకుంటారు.
-
మోదీ పర్యటనకు పటిష్ఠ భద్రత..
ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటన సందర్భంగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆర్ట్స్ కాలేజీ చుట్టూ 20 కిలో మీటర్ల వరకు నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. పీఎం సెక్యూరిటీ చూసే ఎస్పీజీ దళాలకు తోడు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నాయి. దీనితో పాటు లోకల్గా ఇద్దరు డీఐజీలు, 10 మంది సీపీలు, ఎస్పీలు, 10 మంది డీసీపీలు, 15 మంది అడిషనల్ ఎస్పీలు, 32 మంది ఏసీపీలు, 56 మంది సీఐలు, 250 మంది ఎస్ఐలతో సహా మొత్తం 3,500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు.
-
అప్పుడు పీవీ.. ఇప్పుడు మోదీ ..
వరంగల్ జిల్లాకు ప్రధాని హోదాలో 1994 సంవత్సరంలో పీవీ నర్సింహారావు వచ్చారు. ఆ తరువాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రధానులెవరూ రాలేదు. 29ఏళ్ల తరువాత ప్రధాని మోదీ వరంగల్ జిల్లాకు వస్తున్నారు.
-
వరంగల్ పర్యటనకు ముందు మోదీ ట్వీట్..
ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు తన అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘ రూ. 6,100 కోట్లు విలువైన.. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వరంగల్ బయలుదేరాను. ఈ పనులు హైవేల నుండి రైల్వేల వరకు వివిధ రంగాలను కలిగి ఉన్నాయి. ఈ పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది.
Leaving for Warangal to attend a programme where we will inaugurate or lay the foundation stone for development works worth over Rs. 6100 crores. These works cover different sectors ranging from highways to railways. They will benefit the people of Telangana.
— Narendra Modi (@narendramodi) July 8, 2023
-
మోదీ వరంగల్ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇలా..
- ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి ప్రధాని మోదీ బయలుదేరుతారు. 9.25గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
- 9.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 10.15 గంటలకు మామునూర్ హెలిప్యాడ్ కు ప్రధాని మోదీ చేరుకోనున్నారు.
- అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రకాళి టెంపుల్ కు 10.30 గంటలకు చేరుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 10.45 గంటల వరకు ప్రధాని ఆలయంలో ఉంటారు.
- 10.50 గంటలకు భద్రకాళి దేవాలయం నుంచి బయలుదేరి 11గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకుంటారు.
- 11.35 గంటల వరకు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు.
- 11.45 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.20 వరకు ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొంగారు.
- మధ్యాహ్నం 12.25 గంటలకు మోదీ రోడ్డు మార్గం ద్వారా హెలిప్యాడ్ వద్దకు వెళ్తారు.
- 1.10 గంటలకు హెలికాప్టర్ ద్వారా హకీంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 3.25 గంటలకు రాజస్థాన్ లోని బికనీర్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకుంటారు.