Post-Mortem : ఇకపై రాత్రి పూట కూడా పోస్టుమార్టం.. కేంద్రం కీలక నిర్ణయం
మృతదేహాలకు పోస్టుమార్టం సమయం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాత్రి పూట కూడా పోస్టుమార్టం చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Post-Mortem : మృతదేహాలకు పోస్టుమార్టం సమయం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాత్రి పూట కూడా పోస్టుమార్టం చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మృతదేహాలకు ఇప్పటివరకు కేవలం పగటిపూట మాత్రమే పోస్టుమార్టం చేసేందుకు చట్టం అనుమతిస్తోంది. దీంతో కొన్ని సందర్భాల్లో పోస్టుమార్టం కోసం గంటల తరబడి ఆస్పత్రుల్లోనే మృతదేహాన్ని ఉంచాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యాస్తమయం తర్వాత అంటే రాత్రి వేళల్లోనూ పోస్టుమార్టం చేసేందుకు వీలు కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. పోస్టుమార్టం చేసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలున్న ఆస్పత్రుల్లో శవ పరీక్షలను 24గంటలూ చేసేందుకు నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
‘బ్రిటిష్ పాలన ముగిసింది. బ్రిటీష్ కాలం నాటి మరో నిబంధనకు చెల్లు చీటీ ఇచ్చాం. 24 గంటలూ పోస్టుమార్టం చేయవచ్చు. ప్రధాని నరేంద్రమోదీ ఆలోచన మేరకు సుపరిపాలన అందించడంలో భాగంగా కేంద్ర ఆరోగ్యశాఖ మరో నిర్ణయం తీసుకుంది. రాత్రివేళల్లో పోస్టుమార్టం చేసేందుకు సౌకర్యాలున్న ప్రభుత్వ ఆస్ప్రతుల్లో ఇక నుంచి సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్టుమార్టం నిర్వహించవచ్చు’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.
Copper : రాగిపాత్రలో నీళ్ళు తాగితే రోగాలు మాయం?
ఎవరైనా వ్యక్తి చనిపోయిన సందర్భంలో మెడికోలీగల్ కేసులన్నింటికీ చట్టప్రకారం పోస్టుమార్టం చేస్తారనే విషయం తెలిసిందే. కాగా, మెడికో లీగల్ కేసుల్లోని మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే సమయంపై ఎన్నో రోజులుగా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ విభాగంలోని సాంకేతిక కమిటీ పరిశీలించింది. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, ముఖ్యంగా రాత్రివేళల్లో పోస్టుమార్టానికి అవసరమైన లైటింగ్తోపాటు మౌలిక సదుపాయాలను ఆయా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయడం సాధ్యమేనని అభిప్రాయపడింది.
ఇప్పటికే కొన్ని ఆస్పత్రులు రాత్రివేళ పోస్టుమార్టం చేస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కమిటీ.. అన్ని వేళలా పోస్టుమార్టం చేయడం సాధ్యమేనని తెలిపింది. అయితే మర్డర్, సూసైడ్, రేప్, కుళ్లిన మృతదేహాలతో పాటు అనుమానాస్పద కేసులకు మాత్రం రాత్రిపూట పోస్టుమార్టం చేయరాదని నిర్ణయించినట్లు సమాచారం. ఇక రాత్రిపూట చేసే పోస్టుమార్టాలకు తప్పనిసరిగా వీడియో చిత్రీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. తద్వారా ఆ పోస్టుమార్టానికి సంబంధించి భవిష్యత్లో లీగల్ సమస్యలకు ఉపయోగపడుతుందని వివరించింది.
Tongue Color : ఆరోగ్యాన్ని చెప్పే నాలుక రంగు..
పలువర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది మరణించిన వ్యక్తి ఆప్తులకే కాదు.. అవయవ దానం చేసేవారికి, స్వీకరించే వారికి ఎంతో మేలు చేకూర్చనుందని తెలిపింది. సకాలంలో మృతదేహం నుంచి అవయవాన్ని సేకరించి భద్రపరచవచ్చునని, తద్వార అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి వీలవుతుందని వివరించింది.