Sravana Masam : శ్రావణ మాసం విశిష్టమైనది ఎందుకంటే….

శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వత్రాన్ని నిర్వహిస్తారు. అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు.

Sravana Masam : శ్రావణ మాసం విశిష్టమైనది ఎందుకంటే….

Sravanamasam (1)

Sravana Masam : హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. తెలుగుసంవత్సరంలో 12 మాసాలలో 5వ మాసంగా ఉన్నఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసంగా పేరు వచ్చింది. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందట.

శ్రావణ మాసంలో ప్రతిరోజు చాలా ప్రత్యేకతతో కూడుకున్నదే. శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా ఇదే. శ్రీకృష్ణుడు పుట్టినది శ్రావణమాసంలోనే కాగా, శ్రీనివాసుని జన్మదినం కూడా ఈమాసంలోనే.. శ్రవణ నక్షత్రానికి అధిపతిగా ఉండే శివుడు ఈ మాసంలో మహావిష్ణువుని పూజిస్తాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. హనుమంతునితోపాటు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మేశ్వరుడు శ్రావణ మాసంలోని మంగళవారం రోజునే జన్మించారని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే శ్రావణ మాసంలో మంగళవారాల్లో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలతో గడుపుతారు. మహిళలు ముఖ్యంగా ఆరోజుల్లో మంగళగౌరి వ్రతాలు నిర్వహించుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మహాలక్ష్మీ దేవి కటాక్షం ఉంటుందని శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాలు ఆచరిస్తుంటారు. అమ్మవారికి కుంకుమార్చనలు, ఎర్రని పూలు, మల్లెమాలలను సమర్పిస్తే రుణ విముక్తి, లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు.

శ్రావణ మాసంలో వచ్చే పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసలో మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తైదువులతోపాటు, పెండ్లికాని యువతులు ఈ మంగళగౌరి వ్రతం భక్తితో నిర్వహిస్తారు. పసుపు, బంగారం, వెండితో గౌరమ్మను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం. శ్రావణ శుద్ద చవితి ,పంచమి రోజున నాగుల చవితి, నాగపంచమిని జరపుతారు. ఆరోజున పుట్టలో పాలుపోస్తే సర్వదోషాలు తొలిగిపోతాయట.

శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వత్రాన్ని నిర్వహిస్తారు. అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు. నవ వధువులతో తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. అష్టఐశ్వార్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారికి ప్రార్ధిస్తారు. అదే విధంగా శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమని శ్రావణ పూర్ణిమగా జరుపుతారు. రక్షా బంధన్ , జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి గా పిలుస్తారు. ఆరోజు సంతోషిమాత జయంతి కూడా కావటంతో అమ్మవారిని ఆరాధిస్తారు.

శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆరోజున శ్రీకృష్ణాష్టమిగా నిర్వహిస్తారు. ఆరోజన కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే 24 ఏకాదశి వ్రతాలు చేసిన ఫుణ్యఫలం దక్కుతుందని వేదపండితులు చెబుతున్నారు. ఆరోజున చిన్నారులతో కృష్ణుడి వేషాలు, ఆడపిల్లలు గోపిక వేషాలతో ఉట్టి సంబరాలు నిర్వహించటం ఆనవాయితీ.

శ్రావణ మాసం కృష్ణ పక్ష అమావాస్యను పొలాల అమావాస్యగా పిలుస్తారు. సంతానాన్ని కోరుకునే వారు, పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోవాలనుకున్నవారు ఈ అమావాస్యను నిర్వహిస్తారు. పొలాల అమావాస్యను ప్రస్తుతం అంతా పోలేరు అమావాస్యగా, గ్రామ దేవతైన పోలేరమ్మను అరాధించే రోజుగా నిర్వహిస్తున్నారు. శ్రావణమాసంలో సోమవారం రోజున శివునికి ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం