Wrestlers Protest: మరోసారి చర్చలకు రండి.. అమిత్ షాతో భేటీ తరువాత రెజ్లర్లతో చర్చలకు సిద్ధమైన ప్రభుత్వం.. అర్థరాత్రి కేంద్ర మంత్రి ట్వీట్
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవిని మహిళా అభ్యర్థి చేపట్టాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ కుటుంబ సభ్యులెవరూ డబ్ల్యూఎఫ్ఐలో ఉండకూడదని, అతన్ని అరెస్టు చేయాలనే డిమాండ్లను అమిత్ షా వద్ద రెజ్లర్లు ప్రస్తావించారు.
Brij Bhushan Saran Singh: రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Saran Singh) పై రెజ్లర్లు (Wrestlers) లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న విషయం విధితమే. అతన్ని పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలని రెజ్లర్లు నిరసన (Wrestlers protest) తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల వారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అమిత్ షా నుంచి రెజ్లర్ల డిమాండ్ల పరిష్కారంపై స్పష్టమైన హామీ రాలేదని తెలిసింది. అయితే, రెజ్లర్లు బజరంగ్ పునియా (Bajrang Punia), సాక్షి మాలిక్ (Sakshi Malik), వినేష్ ఫోగట్ (Vinesh Phogat)లు రైల్వేలో తమ ఉద్యోగాల్లో తిరిగి జాయిన్ అయ్యారు. దీంతో రెజ్లర్లు ఆందోళన విరమించారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సాక్షి మాలిక్ ఖండించారు. న్యాయం జరిగేవరకు మేము వెనక్కు తగ్గమని, మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అమిత్ షాతో రెజ్లర్ల భేటీ తరువాత ఈ విషయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ (Union Sports Minister Anurag Thakur) రెజ్లర్లను మరోసారి చర్చకు రావాలని ఆహ్వానించారు. మంగళవారం అర్థరాత్రి తరువాత కేంద్ర మంత్రి తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఈ మేరకు పోస్టు చేశారు. రెజ్లర్ల డిమాండ్లపై వారితో చర్చకు ప్రభుత్వం సుముఖంగా ఉందని, వారిని మరోసారి చర్చలకోసం ఆహ్వానిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఆహ్వానంపై రెజ్లర్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఇటీవల అమిత్ షాతో భేటీ సందర్భంగా రెజ్లర్లు తమ డిమాండ్లను స్పష్టంగా వెల్లడించినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవిని మహిళా అభ్యర్థి చేపట్టాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ కుటుంబ సభ్యులెవరూ డబ్ల్యూఎఫ్ఐలో ఉండకూడదని, అతన్ని అరెస్టు చేయాలనే డిమాండ్లను అమిత్ షా వద్ద రెజ్లర్లు ప్రస్తావించారు. అమిత్ షా మాత్రం రెజ్లర్లకు ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. చట్టాన్ని తనపని తనని చెయ్యనివ్వాలని, చట్టం అందరికీ సమానమే అని రెజ్లర్ల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే, సమయం పట్టినా మీవైపు న్యాయం ఉంటే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని, ఆ మేరకు నేను హామీ ఇస్తున్నానని అమిత్ షా రెజ్లర్లకు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేంద్ర క్రీడా మంత్రి రెజ్లర్లను చర్చలకు మరోసారి ఆహ్వానించారన్న వాదన వినిపిస్తుంది.
The government is willing to have a discussion with the wrestlers on their issues.
I have once again invited the wrestlers for the same.
— Anurag Thakur (@ianuragthakur) June 6, 2023
ఈ ఏడాది జనవరి 18న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ లతో పాటు దాదాపు 30 మంది రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే. జనవరి 19న కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్తో రెజ్లర్ల భేటీ తరువాత న్యాయం చేస్తామని హామీ రావడంతో నిరసనకు కొద్దిరోజులు విరామం ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పురోగతి లేకపోవటంతో ఏప్రిల్ 23న మరోసారి జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు ధర్నాకు దిగారు. ఆ విషయం సుప్రీంకోర్టుకు చేరడంతో కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కానీ, అతన్ని అరెస్టు చేసి, పదవి నుంచి తొలగించాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఇటీవల జంతర్ మంతర్ వద్ద ధర్నాకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు నిరాకరించారు. దీంతో పలు రూపాల్లో రెజ్లర్లు తమ నిరసన తెలుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో గత శనివారం రాత్రి సమయంలో రెజ్లర్లు అమిత్ షాతో భేటీ అయ్యారు.