దిశపై సినిమా: ఆమె పాత్రలో సమంత? నివేదా థామస్?

  • Published By: vamsi ,Published On : December 22, 2019 / 02:27 AM IST
దిశపై సినిమా: ఆమె పాత్రలో సమంత? నివేదా థామస్?

ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు.. మనిషనేవాడిలో ఉన్న తోడేలు బయటకు వస్తోంది. పీక్కు తినడానికి, ఏ మాత్రం ఆలోచించకుండా కాలనాగులా కాటేస్తున్నాడు. హైదరాబాద్ శివార్లలో శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన కూడా అటువంటిదే. ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత ఒక్కసారిగా దేశం అట్టుడికిపోయేలా చేసిన ఘటన ఇది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ ఘటన సంచలనం అయ్యింది.

నిందితుల్ని మేమే చంపేస్తామంటూ వేలాదిగా ప్రజలు పోలీస్ స్టేషన్‌పై పడ్డారు. నాడు నిర్భయ ఘటన జరిగినప్పుడు.. ప్రపంచం మొత్తం ఎలా కన్నీరు పెట్టుకుందో ఇప్పుడు అదే ఆవేశం ఆగ్రహంతో ఊగిపోయారు ప్రజలు. ఈ ఘటనపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నిందితులు నలుగురు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.

అయితే లేటెస్ట్‌గా ఈ ఘటనపై సినిమా తీసేందుకు సిద్ధం అయ్యారు కొందరు దర్శక నిర్మాతలు. ముందుగా ఈ సినిమా తీసేందుకు తమిళ చిత్ర సీమ ప్లాన్ చేస్తుంది. తమిళ దర్శకుడు శరవరణ్ దిశ హత్యాచారం, నిందితుల ఎన్ కౌంటర్ తదనంతర పరిణామాలపై స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. సౌత్ స్టార్ హీరోయిన్ సమంతను దిశగా చూపిస్తూ స్క్రిప్ట్ రెడీ చేసినట్టు సమాచారం.

అలాగే దిశలా కనిపించాలంటే తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్‌డం సంపాదించుకున్న నటి నివేదా థామస్ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట. ఈ క్రమంలో ఇద్దరిలో ఒకరితో ఈ సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శర్వానంద్ ‘96’ మూవీ రీమేక్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్న సమంత ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ చెబుతుందో లేదో చూడాలి. ఇక నివేదా థామస్ ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురి పాత్ర ‘దర్బార్’ సినిమాలో నటిస్తుంది.