బాల్ ఠాక్రే మొమోరియల్ కోసం చెట్లను టచ్ చేయోద్దు…సీఎం ఉద్దవ్

  • Published By: venkaiahnaidu ,Published On : December 9, 2019 / 02:38 PM IST
బాల్ ఠాక్రే మొమోరియల్ కోసం చెట్లను టచ్ చేయోద్దు…సీఎం ఉద్దవ్

ఔరంగబాద్‌లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం చెట్లను నరికివేయరాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మౌఖిక ఆదేశాలు జారీ చేశారని శివసేన ఎంపీ చంద్రకాంత్ ఖైరే తెలిపారు. బాల్‌ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం వెయ్యికి పైగా చెట్లు నరికివేతకు గురవుతున్నాయని ఆదివారం పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, మీడియా మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఆదివారం శివసేనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అయితే బాల్‌ ఠాక్రే స్మారక నిర్మాణానికి ఒక్క చెట్టును నరికివేయడానికి వీల్లేదని, చెట్లకు ఎటువంటి హాని తలపెట్టకుండానే ప్రతిపాదిత స్మారక నిర్మాణం చేపట్టనున్నట్లు ఔరంగాబాద్ ఎంపీ చంద్రకాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దివంగత బాలాసాహెబ్‌ ఠాక్రే, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే పర్యావరణానికి సంబంధించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. స్మారక నిర్మాణం కోసం ప్రియదర్శిని గార్డెన్‌లో చెట్లను నరికివేస్తామని శివసేన ఎన్నడు చెప్పలేదు. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నుంచి ఆదివారం సాయంత్రం మౌఖిక ఆదేశాలు అందాయని.. ఉత్తర్వులను కచ్చితంగా పాటిస్తామని  ఖైరే తెలిపారు.

ప్రియదర్శిని ఉద్యానవనంలో కనీసం 80 రకాల పక్షులు ఉన్నాయి. వాటిలో 52 భారత సంతతికి చెందగా మిగిలినవి విదేశీ పక్షులు. 35 రకాల సీతాకోక చిలుకలు, ఏడు రకాల పాములతో పాటు 80 రకాల కీటకాలతో పాటు సరిసృపాలకు నివాసంగా ఉంటూ ప్రధాన ఆక్సిజన్ వనరుగా ఉందని ఆయన తెలిపారు.