అసోం మాజీ సీఎం భూమిధర్ బర్మన్ కన్నుమూత
అసోం మాజీ సీఎం,సీనియర్ కాంగ్రెస్ లీడర్ భూమిధర్ బర్మన్(91) కన్నుమూశారు.
Bhumidhar Barman అసోం మాజీ సీఎం,సీనియర్ కాంగ్రెస్ లీడర్ భూమిధర్ బర్మన్(91) కన్నుమూశారు. అనారోగ్యం బారినపడిన ఆయన..కొద్దిరోజులుగా గువాహటిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినందున ఆదివారం సాయంత్రం 6:20 గంటలకు తుదిశ్వాస విడిచారు.
1931లో జన్మించిన బర్మన్.. 1967లో రాజకీయాల్లో ప్రవేశించారు. భూమిధర్ బర్మన్ మొత్తం ఏడుసార్లు అసోం శాసనసభకు ఎన్నికయ్యారు. బర్మన్… హితేశ్వర్ సైకియా మరియు తరుణ్ గొగోయ్ ప్రభుత్వాలలో…ఆరోగ్యం, విద్య మరియు రెవెన్యూ వంటి ముఖ్యమైన శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
రెండు సార్లు అసోం సీఎంగా కూడా బర్మన్ సేవలందించారు. 1996 ఏప్రిల్-22న లో అసోం సీఎంగా ఉన్న హితేశ్వర్ సైకియా అనారోగ్య కారణాలతో మరణించగా ఆయన స్థానంలో బర్మన్ సీఎం బాధ్యతలు చేపట్టారు.1996 ఏప్రిల్ 22 నుంచి అదే ఏడాది మే 14 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2010లో మరోసారి బర్మన్ సీఎం అయ్యారు. 2010లో అప్పటి సీఎం తరుణ్ గోగోయ్ హార్ట్ సర్జరీ కోసం ముంబై వెళ్లిన సమయంలో బర్మన్ తాత్కాలిక సీఎం బాధ్యతలు చేపట్టారు. 2015లో రాష్ట్ర మంత్రిగానూ బర్మన్ సేవలందించారు.