స్మశానాల్లో “హౌస్ ఫుల్” బోర్డులు

స్మశానాల్లో “హౌస్ ఫుల్” బోర్డులు

Crematorium Closes

crematorium closes ఇప్పటివరకు సినిమా థియేటర్లకే చూశాం.. కానీ ఇప్పుడు కరోనా కల్లోలంతో శ్మశాన వాటికలకు హౌస్‌ఫుల్‌ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనాతో చనిపోయిన శవాలు భారీగా వస్తుండడంతో ఖననం చేయడానికి ఖాళీ లేక బెంగళూరులోని పలు శ్మశానవాటికలు ‘హౌస్‌ఫుల్‌’ అనే బోర్డులు తగిలేస్తున్నాయి. చామ్‌రాజ్‌పేటలోని శ్మశాన వాటిక ‘హౌస్‌ఫుల్‌’ అనే బోర్డు తగిలేసింది. శ్మశానంలో రోజుకు 20కి పైగా కరోనాతో మరణించిన మృతదేహాలు వస్తుండడంతో ఈ మేరకు శ్మశాన వాటిక నిర్వాహకులు బోర్డు పెట్టేశారు.

బెంగళూరులో 13 విద్యుత్‌ దహన వాటికలు ఉండగా అవి నిరంతరం బిజీగా ఉంటున్నాయి. శ్మశానాల కొరత ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం.. బృహత్‌ బెంగళూరు మహానగర్‌ పాలికె (బీబీఎంపీ)కి 230 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. వాటిలో అంత్యక్రియల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇక, మృతుల కుటుంబీకులే తమ సొంత ప్లాట్లు, ఫామ్‌హౌస్‌, పొలాలు ఉంటే అక్కడే ఖననం.. లేదా అంత్యక్రియలు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

కాగా, కర్నాటకలో మహమ్మారి కరోనా తీవ్రస్థాయిలో దాడి చేస్తోంది. ముఖ్యంగా బెంగళూరులో 20వేలకు పైగా కేసులు ప్రతిరోజూ నమోదవుతుండటం ఆందోళనకరం. ఆదివారం నాటికి కర్నాటక వ్యాప్తంగా కరోనా కేసులు 16 లక్షలు దాటగా..మరణాల సంఖ్య 16వేలు దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 లక్షల 21వేలకు పైగా యాక్టివ్ కేసులుండగా..ఒక్క బెంగళూరులోనే 2లక్షల 81వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.

మరోవైపు,దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా మృతులకు అంత్యక్రియల కోసం శ్మశానవాటికల్లో గంటలపాటు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో శునకాల స్మశానాన్ని కూడా మానవ మృతదేహాల అంత్యక్రియలకు వినియోగిస్తున్నారు. ఇంకోవైపు,ఢిల్లీలోని శ్మశానాల్లో భౌతికకాయాలను కాల్చడానికి కట్టెలు సైతం దొరకని దుర్భరమైన పరిస్థితి నెలకొంది. లెక్కకు మించిన భౌతికకాయాలు మరుభూములకు వరుస కడుతుండడంతో కాటికాపరులు సైతం చేతులెత్తేస్తున్నారు. దాంతో కుటుంబసభ్యులే అక్కడ ఇక్కడ కట్టెలు సమకూర్చుకుని, ఎక్కడ స్థలం దొరికితే అక్కడ చితులు పేర్చి దహన సంస్కారాలు పూర్తిచేయాల్సి వస్తోంది.