నేను ఇందిరా గాంధీ మనువరాలిని… తగ్గేది లేదు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. యోగి సర్కార్ తనకు వ్యతిరేకంగా ఎన్ని చర్యలు తీసుకున్నా జరుగుతున్న వాస్తవాలను ధైర్యంగా ప్రజల ముందు ఉంచుతానని ప్రియాంక గాంధీ అన్నారు.
కాన్పూర్లోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో 57 మంది బాలికలకు కరోనా సోకిందన్న మీడియా రిపోర్టును ఆదివారం తన ఫేస్బుక్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బాలికలు గర్భవతులు కాగా, ఒకరు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు ఆమె తెలిపారు. లైంగిక వేధింపులకు గురైన బీహార్లోని ముజఫర్పూర్ బాలికల వసతి గృహంతో దీనిని పోల్చారు ప్రియాంక గాంధీ. అయితే రాష్ట్ర బాలల హక్కుల మండలి గురువారం ప్రియాంకు నోటీసులు జారీ చేసింది. ఆశ్రమ గృహంపై తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు చేశారని, దీనికి మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రియాంక గాంధీ ట్వీటర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉత్తర ప్రదేశ్ ప్రజల బాధ్యత ప్రజా సేవకురాలిగా నా కర్తవ్యం. వాస్తవాలను వారి ముందు ఉంచడం నా విధి. ప్రభుత్వం గురించి ప్రచారం చేయడం నా పనికాదు. నన్ను బెదిరించే ప్రయత్నంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సమయం వృథా చేస్తోంది. నాపై ఎన్ని చర్యలు తీసుకున్నా నేను నిజాలను ప్రచారం చేస్తూనే ఉంటాను. అలాగే ‘నేను ఇందిరా గాంధీ మనుమరాలిని.. బీజేపీ అధికార ప్రతినిధిని కాను’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఆగ్రా హాస్పిటల్ లో చేరిన 48 గంటల్లోనే 28 మంది కరోనా రోగులు చనిపోయారంటూ ఈ నెల 22న ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ మీడియా కథనాన్ని జత చేశారు. దీనిపై స్పందించిన ఆగ్రా జిల్లా కలెక్టర్ ప్రభు నరైన్ సింగ్ ఆ ట్వీట్ను తొలగించాలని మంగళవారం ఆమెను కోరారు. కాగా అదే రోజు ఆమె మరింతగా ఘాటుగా బదులిచ్చారు. ఢిల్లీ, ముంబై కన్నా ఆగ్రాలో కరోనా మరణాల రేటు అధికంగా ఉన్నదని ట్వీట్ చేశారు. దీనికి ఎవరు బాధ్యతవహిస్తారన్నది సీఎం యోగి ఆదిత్యనాథ్ 48 గంటల్లో స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Read: స్విస్ బ్యాంకులో భారతీయుల నగదు భారీగా తగ్గిపోయింది