Indian Railways: ప్రత్యేక దోపిడీ కొనసాగుతుంది… రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్

ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. మరికొన్నాళ్లు నిరీక్షణ తప్పదని చెప్పింది. అంతేకాదు అదనపు బాదుడు ఇంకొన్నాళ్లు భరించాల్సిందే అని తేల్చింది.

Indian Railways: ప్రత్యేక దోపిడీ కొనసాగుతుంది… రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్

Indian Railways

Indian Railways Give Shock To Passengers : ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. మరికొన్నాళ్లు నిరీక్షణ తప్పదని చెప్పింది. అంతేకాదు అదనపు బాదుడు ఇంకొన్నాళ్లు భరించాల్సిందే అని తేల్చింది. రెగ్యులర్‌ రైళ్లపై ప్రయాణికుల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే రైల్వేశాఖ వారి ఆశలపై నీళ్లు చల్లింది. జూలై వరకు రెగులర్ రైళ్లే ఊసే లేదంది.

ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో కొన్నింటిని జూన్‌ నెలాఖరు వరకు, మరికొన్నింటిని జులై తొలివారం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. మరికొన్నింటిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. అంటే అప్పటివరకు రెగులర్ రైళ్లు లేనట్టే. ఫలితంగా ప్రయాణికుల నెత్తిన అదనపు చార్జీల మోత తప్పదు. మరో మూడు, నాలుగు నెలల పాటు అదనపు ఛార్జీలతో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయి ఆదాయాలు తగ్గిన ప్రజలపై మరింత భారం పడినట్టు అయ్యింది. ఈ నిర్ణయాన్ని జనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ప్రత్యేక రైళ్లు ఎలా అవుతాయి?
గతేడాది(2020) మార్చిలో లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత దశలవారీగా అందుబాటులోకి వచ్చాయి. వైరస్ క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రయాణికుల అవసరార్థం గతేడాది(2020) చివరి నుంచి పలు జాగ్రత్తలతో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ. ఆ తర్వాత వాటిని క్రమంగా పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం 80 శాతానికిపైగా రైళ్లను పునరుద్ధరించినట్టు ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

కాగా.. ఆర్టీసీ, విమానయాన సంస్థలు మామూలు ఛార్జీలతో రెగ్యులర్‌ సర్వీసులుగానే నడిపిస్తున్నాయి. రైల్వే శాఖ మాత్రం ‘ప్రత్యేకం’ పేరు చెప్పి దోచేస్తోంది. గోదావరి, శబరి, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు అవే బోగీలతో కొవిడ్‌కు ముందునాటి రూట్లలోనే, అవే సమయాల్లోనే ప్రయాణిస్తున్నాయి. ఆ రైళ్ల పాత నంబర్లకు ముందు ‘సున్నా’ కలపడం ఒక్కటే ప్రత్యేకం. ఉన్నవాటికి అదనంగా నడిపే రైళ్లు ప్రత్యేకం అవుతాయి.

కానీ..రెగ్యులర్‌ రైళ్లనే రాయితీలు తీసేసి రైల్వేశాఖ ప్రత్యేకం పేరుతో నడిపిస్తోంది. దసరా, దీపావళి సమయాల్లో కొన్నింటిని పండగ ప్రత్యేక రైళ్లుగా పట్టాలు ఎక్కించింది. వీటిలో ఛార్జీలు పెంచింది. అదనపు ఛార్జీల కోసం వాటిని ఇప్పటికీ కొనసాగిస్తోంది. అదనపు చార్జీలు వసూలు చేస్తున్న రైల్వే తీరుపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

సీనియర్‌ సిటిజన్లకు ఎంత భారమో..
* సీనియర్‌ సిటిజన్లయిన భార్యాభర్తలు సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీకి థర్డ్‌ ఏసీలో ప్రయాణించడానికి కరోనాకు ముందు రూ.2,105 ఖర్చయ్యేది. ఇప్పుడు రాయితీ లేకపోవడంతో రూ.4,240 అవుతోంది. రానూపోను రూ.4,270 వరకు పెరిగింది. ఫస్ట్‌ ఏసీ ప్రయాణం అయితే.. రానూపోను ఇద్దరికి కలిపి రూ.11,900 వరకు అదనపు భారం పడుతోంది.
* సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నంకు థర్డ్‌ ఏసీ ప్రయాణ ఖర్చుల్ని పరిశీలిస్తే.. కరోనాకు ముందు రాయితీ ప్రయాణంతో రూ.1,280 అయితే ఇప్పుడు చెల్లించాల్సింది రూ.2,670. రూ.1,390 పెరిగింది. రానూపోను రూ.2,780 భారం పడుతోంది.
* ప్రయాణమార్గం ఏదైనా ఇదే రకమైన భారం. వీరే కాదు విద్యార్థులు, వికలాంగులు, కళాకారులు.. ఇలా 51 రకాల రాయితీలు పొందే వారందరిపై రైల్వే శాఖ భారం మోపుతోంది. రాయితీలకు అవకాశం లేని సాధారణ ప్రయాణికులనూ పండగ ప్రత్యేక రైళ్ల పేరుతో బాదేస్తోంది.