మొదటి విడతలో 5 రాష్ట్రాలకే కరోనా మెడిసిన్ “కోవిఫర్”
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా కోసం పరిశోధనలు మరింత వేగవంతం అయ్యాయి. దీనికి మందు కనిపెట్టే పనిలో పడ్డాయి భారతదేశానికి చెందిన ప్రముఖ ఔషధ కంపెనీలు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటిరో డ్రగ్స్.. కోవిడ్-19 చికిత్సకు రెమ్డెసివిర్ ఔషధం ‘కోవిఫర్ Coviforను తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ ఔషదానికి ఐసీఎంఆర్ కూడా అనుమతిచ్చింది.
రాబోయే మూడు నాలుగు వారాల్లో కోవిఫర్ డ్రగ్… లక్ష వయల్స్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నహెటిరో కంపెనీ…ముం దుగా 20,000 వయల్స్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు బుధవారం తెలిపింది. ఇందులో 10,000 వయల్స్ హైదరాబాద్, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు త్వరలోనే సరఫరా చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. ‘కొవిఫర్’ 100 ఎంజీ వయల్ (ఇంజక్టబుల్) రూపంలో వస్తుంది. 100 మిల్లీగ్రాముల కోవిఫర్ వయల్ ధరను రూ. 5,400గా హెటిరో నిర్ణయించింది.
కోల్ కతా,ఇండోర్,భోపాల్, లక్నో,భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కోచి, త్రివేండ్రం, గోవా తదితర నగరాలకు వారం రోజుల వ్యవధిలో ఈ ఔషధాన్ని సరఫరా చేయగలమని హెటిరో తెలిపింది.
ప్రస్తుతం, హైదరాబాద్లోని హెటిరో కంపెనీ ఫార్ములేషన్ ఫెసిలిటీలో ఈ కోవిఫర్ మందును తయారు చేస్తున్నారు. క్రియాశీల ఔషధ పదార్ధం (API) సంస్థ యొక్క విశాఖపట్నం ఫెసిలిటీలో తయారు చేయబడుతోంది. ఈ ఔషధం ఆసుపత్రులు మరియు ప్రభుత్వాల ద్వారా మాత్రమే లభిస్తుంది, రిటైల్ ద్వారా ఈ మందు లభించదని హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి వంశీ కృష్ణ బండి తెలిపారు.
Read: జాగ్రత్తగా లేకపోతే, మరోసారి లాక్ డౌన్ విధిస్తా-యడ్యూరప్ప