Complete Lockdown : కరోనా కట్టడికి ‘లాక్’ తప్పదా, స్మశానాల్లో విదారక దృశ్యాలు..ఒకేసారి 28 మందికి అంత్యక్రియలు
మహారాష్ట్రలో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ తప్పదా..? అంతకంతకూ పెరుగుతన్న కేసుల కట్టడికి పూర్తి ఆంక్షలే సరైన మందా..? లాక్డౌన్ పెడితేనే వైరస్ అదుపులోకి వస్తుందా..? మరి లాక్డౌన్పై ఉద్దవ్ సర్కార్ ఏం ఆలోచిస్తోంది..?
Maharashtra: మహారాష్ట్రలో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ తప్పదా..? అంతకంతకూ పెరుగుతన్న కేసుల కట్టడికి పూర్తి ఆంక్షలే సరైన మందా..? లాక్డౌన్ పెడితేనే వైరస్ అదుపులోకి వస్తుందా..? మరి లాక్డౌన్పై ఉద్దవ్ సర్కార్ ఏం ఆలోచిస్తోంది..? మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో రోజురోజుకూ కేసులు నమోదవుతున్నాయక్కడ. కొన్ని రోజులుగా 50 వేలకు పైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. 24 గంటల్లోనే 58 వేల 993 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కరోనాతో ఒక్కరోజే 301 మంది చనిపోయారు. అటు యాక్టివ్ కేసులు సంఖ్య 5 లక్షల 30 వేలు దాటేసింది.
మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో కరోనా ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతోంది. మహమ్మారి దెబ్బకు అక్కడి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా రోగులకు దహన సంస్కారాలు చేయడంలో అహ్మద్నగర్ మున్సిపల్ కార్పోరేషన్ సవాల్ ఎదుర్కొంటోంది. స్మశానాల్లో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడి స్మశాన వాటికలో 22 మంది కరోనా మృతులకు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు.
మరోవైపు కరోనా ఉద్ధృతి వేళ 2021, ఏప్రిల్ 10వ తేదీ శనివారం మహారాష్ట్ర అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని బీజేపీ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ప్రవిన్ దారేకర్ వెల్లడించారు. కొవిడ్ విజృంభణ రోజురోజుకీ పెరిగిపోతుండడంతో లాక్డౌన్వైపు మహా సర్కార్ ఆలోచిస్తుంది. మంత్రుల నుంచి పూర్తి స్థాయి లాక్డౌన్ పెట్టాలన్న ప్రతిపాదనలు పెరిగాయి. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకొని కరోనా కట్టడే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని ప్రతిపాదించినట్టు మంత్రి విజయ్ వడెట్టివార్ తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పూర్తి లాక్డౌన్ పెట్టే అంశంపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.