నాడు నచికేత..నేడు అభినందన్
పాకిస్తాన్ సైనికుల నిర్భందంలో ఉన్న మిగ్ – 21 యుద్ధ విమానం కమాండ్ అభినందన్ వర్ధమాన్ క్షేమంగా విడుదల చేయాలని భారత్ కోరుతోంది. అభినందన్ యోగక్షేమాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ఆయన పట్టుబడడంతో అందరి దృష్టి నచికేతపై పడింది. గతంలో నచికేత కూడా పాక్ సైనికుల నిర్భందంలో ఉన్నాడు. 1999 మే కార్గిల్ యుద్ధ సమయంలో మిగ్ – 27 యుద్ధ విమానం నడుపుతూ లెఫ్టినెంట్ నచికేత ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో దూకాడు. వెంటనే పాక్ సోల్జర్స్ అతడిని అదుపులోకి తీసుకున్నారు. వారికి చిక్కకుండా ఉండేందుకు కాల్పులు జరిపాడు నచికేత. కానీ ఏకే -56 రైఫిళ్లతో వచ్చిన పాక్ సైనికులు పై చేయి సాధించారు. నచికేతను నిర్భందించారు. మూడు, నాలుగు రోజులు చిత్ర హింసలకు గురి చేశారు. ఈ హింసలకంటే చంపడమే మేలని ఆనాటి గుర్తులను ఓ ఇంటర్వ్యూలో నచికేత పేర్కొన్నారు. అంటే ఎంతలా హింసించారో అర్థమౌతుంది.
నచికేతను వెనుకకు రప్పించే బాధ్యతలను అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇస్లామాబాద్లో భారత హై కమిషనర్గా ఉన్న పార్థసారధికి అప్పగించింది. అంతర్జాతీయ మీడియా, ఐరాస ఒత్తిడి చేయడంతో పాక్ తలొగ్గింది. జెనీవా ఒప్పందం ప్రకారం పైలట్ని అప్పగించాల్సిన బాధ్యత పాక్దేనని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు ఆనాటి జ్ఞాపకాలను పార్థసారధి గుర్తు చేసుకున్నారు. 8 రోజుల కస్టడీ అనంతరం నచికేతను రెడ్ క్రాస్కు అప్పగించింది. వాఘా సరిహద్దు మీదుగా స్వదేశానికి చేరుకున్నారు.