Idayam Trust : కరోనా పేరుతో అనాథ ఆశ్రమంలో దారుణాలు..చిన్నారుల్ని అమ్మేసిన ఇదయం ట్రస్ట్ నిర్వాహకులు

మధురైలో అనాధ చిన్నారుల సంరక్షణ కేంద్రం ఇదయం ట్రస్ట్ నుంచి 16 మంది పిల్లలు మాయం అయిన ఘటన సంచలనం కలిగించింది. దీనిపై విచారణ జరుపగా కరోనా సోకి పిల్లలు చనిపోయారని చెబుతూ ట్రస్ట్ నిర్వాహకులు చిన్నారులను అమ్మేసుకుంటున్నా దారుణం వెలుగులోకి వచ్చింది. అలా ఇప్పటి వరకూ 16మంది చిన్నారుల్ని అమ్మేసినట్లుగా తేలింది.

Idayam Trust : కరోనా పేరుతో అనాథ ఆశ్రమంలో దారుణాలు..చిన్నారుల్ని అమ్మేసిన ఇదయం ట్రస్ట్ నిర్వాహకులు

Madurai Idhayam Trust Children Missing (1)

Missing 16 children from Madurai Idayam Trust : తమిళనాడులోని మధురైలో దారుణం చోటు చేసుకుంది. అనాధ చిన్నారుల సంరక్షణ కేంద్రం ఇదయం ట్రస్ట్ నుంచి 16 మంది పిల్లలు మాయం అయ్యారు. డబ్బుల కోసం పసిబిడ్డలను అమ్మేసుకున్నారు అనాథ ఆశ్రమం ట్రస్ట్ నిర్వాహకులు. కరోనా మహమ్మారిని అడ్డం పెట్టుకుని పసిపిల్లలను కూరగాయలు అమ్మేసినట్లుగా పిల్లల్ని అమ్మేశారు.అనాథ ఆశ్రమంలో ఓ బాలుడు కరోనాతో మరణించినట్టు నమ్మించేందుకు నిర్వాహకులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారితో ఎంతోమంది ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న క్రమంలో ఆ కరోనానే అడ్డం పెట్టుకుని ఆశ్రమంలో కరోనాతో పిల్లలు చనిపోయారని నమ్మించి పిల్లలను అమ్మేసిన దారుణం వెలుగులోకి వచ్చింది.

వారం క్రితం ఇద్దరు చిన్నారులు మాయం ఘటనపై విచారణ జరపగా..ట్రస్ట్ నిర్వాహకులు చేసిన అక్రమాలు..దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అనాథ పిల్లలే కదా..అడిగేవారు ఎవరూ లేరనే ధీమాతో పిల్లలను అమ్మేసినట్లుగా తెలుస్తోంది. అమ్మేసిన పిల్లల గురించి ఆరా తీయగా..పిల్లలు కరోనాతో చనిపోయారని తప్పుడు రికార్డులు సృష్టించారు ట్రస్ట్ నిర్వాహకులు. అనాధ చిన్నారుల సంరక్షణ కేంద్రం ఇదయం ట్రస్ట్ నుంచి 16 మంది పిల్లలు మాయం అయ్యారనే ఘటన బయపటడడంతో కలకలం రేగింది. స్థానికంగా సంచలనం కలిగించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. మధురై జిల్లాలోని మేలూరు సమీపంలోని సేక్కిపట్టికి చెందిన ఐశ్వర్య అనే 22 ఏళ్ల మహిళ భర్తను కోల్పోంది. ఆ తర్వాత తన ముగ్గురు పిల్లలను ‘ఇదయం ట్రస్టు’ నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో చేర్పించింది. ఈక్రమంలో జూన్ 13న ఐశ్వర్య మూడు ఏళ్ల మూడవ కొడుకు మాణిక్కం కరోనా సోకిందని..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని ట్రస్ట్ నిర్వాహకుల నుంచి ఐశ్వర్యకు సమాచారం అందింది.

కానీ వారి మాట్లాడే తీరును బట్టి ఐశ్వర్యకు అనుమానం వచ్చింది. దీంతో ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేసిందనే విషయం తెలుసుకున్న ఆశ్రమ నిర్వాహకులు శివకుమార్, మదర్షాలు పరారయ్యారు. ఈ క్రమంలో ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా షాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడు సంవత్సరాల మాణిక్కంను ఆశ్రమ నిర్వాహకరులు శివకుమార్, మదర్షా కలిసి పిల్లాడిని తీసుకుపోయి మధురై ఇస్మాయిల్ పురానికి చెందిన కన్నన్, భవానీ దంపతులకు రూ. 5 లక్షలకు అమ్మేసినట్లుగా తేలింది. అంతేకాదు..పోలీసులు దర్యాప్తులో మరిన్ని విషయాలు బైటపడ్డాయి. శ్రీదేవి అనే మరో మహిళ కూతురుని కూడా ఆశ్రమ నిర్వాహకులు అమ్మేసినట్లుగా తెలిసింది. అలా ఒకరూ ఇద్దరూ కాదు ఆశ్రమం నుంచి ఇప్పటి వరకు 16 మంది చిన్నారులు అదృశ్యమైనట్టు గుర్తించారు.

పిల్లలను కొనుగోలు చేసిన కన్నన్, భవానీ దంపతులతోపాటు సక్కుబాయి, సాదిక్ అనే భార్యాభర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆశ్రమంలోని ఏడుగురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమంలో ఉంటున్న 38 మంది పురుషులు, 35 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులను వేర్వేరు ప్రాంతాల్లోని అనాథాశ్రమాలకు తరలించినట్లుగా తేలింది. ఇంతటి దారుణాలకు పాల్పడుతున్న ఇదయం ట్రస్టు నిర్వాహకులపై మధురై కలెక్టర్ అనీష్ శేఖర్ సమగ్ర విచారణకు ఆదేశించారు.పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.