ఛలో మొఘల్ గార్డెన్ : పువ్వుల స్వర్గం, ఆన్ లైన్ లో టికెట్లు

ఛలో మొఘల్ గార్డెన్ : పువ్వుల స్వర్గం, ఆన్ లైన్ లో టికెట్లు

Mughal Gardens : రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్‌ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఏడాదంతా రాష్ట్రపతి భవన్‌కే పరిమితమయ్యే 15 ఎకరాల సువిశాలమైన మొఘల్‌ గార్డెన్‌లోకి ‘ఉద్యానోత్సవ్‌’ పేరిట ఏటా ఫిబ్రవరి- మార్చి నెలల్లో సందర్శకులకు అనుమతిస్తారు. ఉద్యానోత్సవ్‌ కార్యక్రమాన్ని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ప్రారంభం తర్వాత..2021, ఫిబ్రవరి 13వ తేదీ శనివారం నుంచి మార్చి 21 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఉచితంగా గార్డెన్స్‌లోకి అనుమతించనున్నారు.

రాష్ట్రపతి భవన్ :-
దేశంలోని అద్భుతమైన కట్టడాల్లో రాష్ట్రపతి భవన్ ఒకటి. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. భారత, మొఘల్, బౌద్ధ సాంప్రదాయ నిర్మాణ శైలితో, విశాలమైన గదులు, ఆహ్లాదకర ఉద్యానవనాలు, పచ్చిక బయళ్లు, ఫౌంటెయిన్లతో ఎన్నో విశేషాలకు ఇది పెట్టింది పేరు. మార్బల్ హాల్, కిచెన్ మ్యూజియం, చిల్డ్రెన్ గ్యాలరీ, గిఫ్ట్ మ్యూజియం, దర్బార్ హాల్, లైబ్రరీ, అశోక హాల్, మొఘల్ గార్డెన్‌లు ఈ భవనం ప్రత్యేకతలు. అయితే వీటిలో మొఘల్‌ గార్డెన్‌ మరింత ప్రత్యేకం. ఈ పూదోటను చూస్తే చాలు.. పువ్వుల స్వర్గంలో మునిగితేలుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది.

ఎంట్రీ టికెట్లు :-
అరవిరిసిన తులిప్‌ పూలు, విరగ్గాసిన గులాబీలు, విప్పారిన చేమంతులు, పరిమళాలు వెదజల్లే మల్లెలు.. ఔషధ మొక్కలు, బోన్సాయ్‌ వృక్షాలు, కాక్టస్‌ కార్నర్‌.. ఇలా రకరకాల పూలు, మొక్కలు పర్యాటకులకు ఆనందాన్ని పంచనున్నాయి. అలాగే అమెరికన్ హెరిటేజ్, ఫస్ట్ ప్రైజ్, కిస్ ఆఫ్ ఫైర్‌తో పాటు వివిధ రకాల గులాబీలు, ఆసియాటిక్ లిల్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి ఆన్‌లైన్‌లోనే టికెట్‌ బుకింగ్‌ అందుబాటులో ఉంది. మొఘల్‌ గార్డెన్‌ వద్ద ఎంట్రీ టికెట్లు ఇవ్వరని అధికారులు స్పష్టం చేశారు.

ప్రోటోకాల్స్ ప్రకారం ఏర్పాట్లు :-
ప్రోటోకాల్స్‌ ప్రకారం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేస్తున్నారు. సందర్శన ప్రాంతాల్లో వివిధ ప్రదేశాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్రపతి డిప్యూటీ ప్రెస్‌ సెక్రెటరీ కృతి తివారీ తెలిపారు. కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో ప్రతి స్లాట్‌కు కేవలం వంద మందికి అవకాశం కల్పించనున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ఐదుగురికి మించి ఒకే ప్రాంతంలో నిలబడేందుకు అనుమతి లేదు. నార్త్ అవెన్యూకి దగ్గరగా ఉన్న ప్రెసిడెంట్స్ ఎస్టేట్ గేట్ నంబర్ 35 నుంచి సందర్శకులు మొఘల్ గార్డెన్‌లోకి ప్రవేశం కల్పిస్తారు.