Odisha school: స్కూలు ఫీజు చెల్లించలేదని విద్యార్థుల్ని లైబ్రరీలో బంధించిన యాజమాన్యం.. తల్లిదండ్రుల ఆగ్రహం
స్కూలు ఫీజు చెల్లించలేదని విద్యార్థుల్ని ఐదు గంటలు లైబ్రరీ గదిలో బంధించింది యాజమాన్యం. అంతేకాదు.. ఫ్యాన్ గాలి కూడా రాకుండా పవర్ తీసేశారు. విద్యార్థులతో స్కూలు యాజమాన్యం అమానవీయంగా ప్రవర్తించిన ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Odisha school: ఒడిశాలో ఒక ప్రైవేటు స్కూలు యాజమాన్యం దారుణానికి తెగించింది. విద్యార్థులు ఫీజు చెల్లించలేదని వారిని లైబ్రరీలో బంధించింది. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్లో అపీజయ్ అనే ప్రైవేటు స్కూల్లో సోమవారం జరిగింది. సోమవారం ఉదయం.. ఫీజు చెల్లించని 34 మంది విద్యార్థుల్ని క్లాసు టీచర్లు ఒక లైబ్రరీ గదిలో ఉంచి తాళం వేశారు.
ఉదయం తొమ్మిదన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు లైబ్రరీలోనే ఉంచారు. విద్యార్థులకు వారిని గదిలో ఉంచి ఎందుకు తాళం వేస్తున్నారో కూడా తెలీదు. అలా దాదాపు ఐదు గంటలు అదే గదిలో ఉంచారు. అంతేకాదు.. ఆ విద్యార్థులకు ఫ్యాన్ గాలి కూడా రాకుండా స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో ఉక్కపోతలోనే ఐదు గంటలు ఒకే గదిలో ఉండాల్సి వచ్చింది. తర్వాత మధ్యాహ్నం వారిని వదిలేశారు. పిల్లలు ఇంటికి చేరుకున్న తర్వాత నీరసంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఆరాతీశారు. అప్పుడు స్కూలు యాజమాన్యం చేసిన నిర్వాకం బయటపడింది. తర్వాత స్కూలుకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ పిల్లలపై అమానవీయంగా, క్రూరంగా ప్రవర్తించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటన తర్వాత కొందరు విద్యార్థులు తీవ్ర డిప్రెషన్కు కూడా గురయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సెక్షన్ 342, సెక్షన్ 34, సెక్షన్ 75 కింద కేసు నమోదు చేశారు. ఘటనకు బాధ్యులైన స్కూలు సీఈవో, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, వైస్-ప్రిన్సిపాల్ను అదుపులోకి తీసుకున్నారు.