Oxygen Tanker Missing : కరోనా కల్లోలం వేళ కలకలం.. ఆక్సిజన్ ట్యాంకర్ అదృశ్యం
కరోనా కేసుల భారీగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్కు భారీ డిమాండ్ ఏర్పడింది. తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు లేక శ్వాస అందక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రాణవాయువు అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఆక్సిజన్ ట్యాంకర్ అదృశ్యం కావడం కలకలం రేపింది. హర్యానాలోని పానిపట్ నుండి సిర్సాకు ప్రయాణిస్తున్న లిక్విడ్ ఆక్సిజన్ తీసుకెళ్తున్న ట్యాంకర్ తప్పి పోయింది.
Oxygen Tanker Missing : కరోనా కేసుల భారీగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్కు భారీ డిమాండ్ ఏర్పడింది. తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు లేక శ్వాస అందక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రాణవాయువు అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఆక్సిజన్ ట్యాంకర్ అదృశ్యం కావడం కలకలం రేపింది. హర్యానాలోని పానిపట్ నుండి సిర్సాకు ప్రయాణిస్తున్న లిక్విడ్ ఆక్సిజన్ తీసుకెళ్తున్న ట్యాంకర్ తప్పి పోయింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పానిపట్ ప్లాంట్లో లిక్విడ్ ఆక్సిజన్ నింపుకున్న ట్యాంకర్ బుధవారం(ఏప్రిల్ 21,2021) సిర్సాకు బయల్దేరింది. గురువారం(ఏప్రిల్ 22,2021) రాత్రి వరకు ట్యాంకర్ గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. కానీ, రాలేదు. దీంతో కంగారుపడ్డ అధికారులు వెంటనే తమకు ఫిర్యాదు చేసినట్లు పానిపట్లోని మాట్లౌడా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ మంజిత్ సింగ్ తెలిపారు. శుక్రవారం(ఏప్రిల్ 23,2021) మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ట్యాంకర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కాగా, ఇటీవల రాష్ట్రంలో ఇదే తరహా ఘటన జరగ్గా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పానిపట్ నుంచి ఫరీదాబాద్లోని కొవిడ్ ఆసుపత్రికి ఆక్సిజన్ తీసుకెళ్తున్న ట్యాంకర్ ఢిల్లీ భూభాగంలోకి వెళ్లగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం లూఠీ చేసిందని ఆయన ఆరోపించారు. అది మరువక ముందే మరో ఆక్సిజన్ ట్యాంకర్ అదృశ్యం అవడం సంచలనంగా మారింది.