PM Modi : స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి సూచనలివ్వండి
ప్రధాని మోదీ తరచుగా జాతినుద్దేశించి చేసే ప్రసంగాలపై దేశ పౌరుల నుండి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తారన్న విషయం తెలిసిందే.
PM Modi ప్రధాని మోదీ తరచుగా జాతినుద్దేశించి చేసే ప్రసంగాలపై దేశ పౌరుల నుండి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి ప్రధాని మోదీ.. సూచనలు ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానమంత్రి కార్యాలయం ఓ ట్వీట్ చేసింది. మీ ఆలోచనలు, సూచనలు ప్రధాని ప్రసంగంలో చోటుచేసుకొని ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రతిధ్వనిస్తాయి. ఆగస్టు15న ప్రధాని ప్రసంగం కోసం మీ ఇన్పుట్స్ ఏంటీ? వాటిని @mygovindia కు షేర్ చేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం శుక్రవారం ట్విట్టర్ లో పేర్కొంది. అయితే ప్రధాని కార్యాలయం ఈ ట్వీట్ చేసిన సెకన్ల వ్యవధిలోనే ప్రజలు తమ ఆలోచనలను పోస్టు చేయడం ప్రారంభించారు.
పాఠశాల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి టీకాలు వేయడానికి ఒక మిషన్ ప్రోగ్రాంను ప్రకటించాలన్నారు. జనాభ పెరుగుదల భారత్ అతిపెద్ద సమస్యగా మారుతోందని..ఎర్రకోట నుండి జనాభా విస్ఫోటనం గురించి ఏదైనా చెప్పాల్సిందిగా నెటిజన్లు మోదీని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. కొందరు నెటిజన్లు.. పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వివాదం, ఇంధన ధరల పెరుగుదల, వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై మాట్లాడాల్సిందిగా అడిగారు. మరికొందరు.. ద్రవ్యోల్బనం, నిరుద్యోగిత, కొవిడ్ వల్ల భారత్లో నాలుగు లక్షల మంది చనిపోవడం, స్లో వ్యాక్సినేషన్, అవినీతి, కొవిడ్ అనంతరం కూలీల జీవితాలపై దయచేసి మాట్లాడాల్సిందిగా మోదీని కోరారు.