కాంగ్రెస్ పై మోడీ తీవ్ర విమర్శలు…రైతులు బాగుపడటం ఇష్టం లేదా?
Narendra Modi-Namami Gange Mission: నమామి గంగే మిషన్ కింద ఉత్తరాఖండ్ లో రూ. 521కోట్లతో చేపట్టిన ఆరు అభివృద్ధి ప్రాజక్టులను ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించారు. హరిద్వార్లోని జగ్జీత్పుర్లో ఇటీవలే 68 ఎమ్ఎల్డీ ఎస్టీపీ(సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ప్రాజెక్టును నిర్మించారు. అదే ప్రాంతంలోని 27 ఎమ్ఎల్డీ సామర్థ్యం ఉన్న మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ఆధునికీకరించారు. ఈ ప్రాజెక్టులతో పాటు మరో నాలుగింటిని మోడీ ప్రారంభించారు.
గంగా నది ప్రాముఖ్యతను చాటిచెప్పే విధంగా నిర్మించిన తొలి మ్యూజియం ‘గంగా అవలోకన్’ను కూడా మోడీ ప్రారంభించారు. సంస్కృతి, జీవవైవిధ్యం, నది కార్యకలాపాలకు అద్ధం పట్టేలా.. హరిద్వార్ లోని ఛండీ ఘాట్ వద్ద ఈ గంగా అవలోకన్ ను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య, సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, రమేశ్ పొఖ్రియాల్, రతన్లాల్ కఠారియా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ….దేశంలో సుమారు సగం జనాభా అవసరాలను తీరుస్తోన్న గంగానది శుద్ధి కోసం గత ప్రభుత్వాలు ఎలాంటి దూరదృష్టితో పని చేయలేదని విమర్శించారు. . దేశ సంస్కృతి, విశ్వాసం, వారసత్వానికి గంగానది ప్రతీక అని మోడీ అభివర్ణించారు.
అంతేకాకుండా, 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తోన్న ఆందోళనలపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్పై పరోక్ష విమర్శలు చేశారు. దేశంలోని ఓ పార్టీ.. మా ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకిస్తూనే ఉంది. జన్ధన్ ఖాతాలు, జీఎస్టీ, ఒక ర్యాంక్ ఒక పింఛన్, రఫేల్, ఐక్యతా విగ్రహం, పేదలకు విద్యాఉద్యాగాల్లో 10 శాతం కోటా.. ఇలా మేం ఏం చేసినా దానికి అడ్డుపడుతూనే ఉన్నారు. వ్యవసాయ సంస్కరణలు తెస్తే వీటి పైనా ఆందోళన చేస్తున్నారు. రైతులు వారి పంటను స్వేచ్ఛగా అమ్ముకోవడం వారికి ఇష్టం లేదు. ఆ పార్టీకి రైతులు బాగుపడటం ఇష్టం లేదు అంటూ పరోక్షంగా కాంగ్రెస్ పై మోడీ విమర్శలు గుప్పించారు.