మరోసారి కఠినమైన లాక్‌డౌన్: సిద్ధం అవుతున్న రాష్ట్రాలు

  • Published By: vamsi ,Published On : June 12, 2020 / 06:07 AM IST
మరోసారి కఠినమైన లాక్‌డౌన్: సిద్ధం అవుతున్న రాష్ట్రాలు

దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న కోవిడ్ -19 కేసులు ఆందోళన కలిగిస్తుండగా.. ప్రస్తుత అన్‌లాక్ 1.0 సమయంలో సడలించిన కొన్ని ఆంక్షలు తిరిగి తీసుకురావాలని కొన్ని రాష్ట్రాలు నిర్ణయించాయి. మరికొన్ని రాష్ట్రాలు పూర్తి షట్‌డౌన్ మళ్లీ ప్రకటించడం గురించి ఆలోచిస్తున్నాయి.

దేశంలోని ఏడు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుండగా.. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, జమ్ముకశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో వైరస్‌ కేసుల నమోదు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాష్ట్రాల్లో అన్నిట్లో కలిపి ఒక్క రోజులో కరోనా కేసులు పది వేలకుపైగా ఉండడంతో ఈ రాష్ట్రాలు మళ్లీ పూర్తిస్థాయి షట్‌డౌన్ విధించేందుకు సిద్ధం అవుతున్నాయి.

ముఖ్యంగా ఇప్పటికే చైనా, కెనెడాను దాటేసిన మహారాష్ట్రలో కరోనా వల్ల 3,590 మంది చనిపోగా.. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో 38,716కేసులు ఉన్నాయి. అందులో 349మంది చనిపోయారు. మూడోస్థానంలో ఉన్న ఢిల్లీలో కేసుల సంఖ్య 34,687గా ఉండగా, మరణాల సంఖ్య 1,085గా ఉన్నది.

అయితే ఢిల్లీలో వైరస్ సంక్రమణ కేసులు పెరుగుతున్నా కూడా లాక్డౌన్ పొడిగించమంటూ ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర ఒక ప్రకటన చేశారు. అయితే పంజాబ్‌లో మహమ్మారి విస్తరిస్తుండడంతో సిఎం అమరీందర్ సింగ్ వీకెండ్స్, ప్రభుత్వ సెలవు దినాలలో కఠినమైన లాక్డౌన్ చేయాలని ఆదేశించారు. డాక్టర్లు, అవసరమైన సర్వీసు ప్రొవైడర్లు మినహా పౌరులందరూ ఒక యాప్ నుంచి ఈ-పాస్‌లను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాదు ఢిల్లీ నుండి రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రజలకు తప్పనిసరి పరీక్షతో పాటు.. “కఠినమైన షరతులు” విధించడాన్ని పరిశీలించాలని పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్ అధికారులను కోరారు. దేశ రాజధాని నుండి ప్రతిరోజూ సగటున 500-800 వాహనాలు పంజాబ్‌లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు.

ఇక చెన్నైలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులపై ఆందోళన చెందుతున్న మద్రాస్ హైకోర్టు.. చెన్నై నగరాన్ని లాక్ చేయాలని కోరింది. 25 వేలకు పైగా కేసులతో, తమిళనాడు మొత్తం కేసులలో 70% చెన్నైలో ఉంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం పూర్తి లాక్ డౌన్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. 

ఇక జార్ఖండ్‌లోని పాలక కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్.. సీఎం హేమంత్ సోరెన్‌ను పూర్తి లాక్డౌన్ విధించాలని కోరారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో కూడా పూర్తి లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది. కేరళలో కూడా కఠినమైన ప్రమాణాలతో కంటెమెంట్ జోన్లను నిర్వచించే పద్దతిని తీసుకుని రావాలని భావిస్తున్నారు.

Read: ఒకేరోజు 10వేల కరోనా కేసులు: ఉపశమనం.. ఆందోళన.. నాల్గవ స్థానంలోకి ఇండియా