Rahul Gandhi : సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్..స్టేట్మెంట్ రికార్డ్
తనకు వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం కేసులో గురువారం సూరత్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తుది వాంగ్మూలం ఇచ్చారు.
Rahul Gandhi తనకు వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం కేసులో గురువారం సూరత్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తుది వాంగ్మూలం ఇచ్చారు. నేను ఏ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని ఆ కామెంట్ చేయలేదు..కేవలం ఆ సమయానికి వ్యంగ్యం ప్రదర్శించానంతే..అంతకుమించి నాకేం గుర్తులేదు అని రాహుల్ కోర్టుకు తెలియజేశారు.
కాగా, ఏప్రిల్-13,2019న కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరును ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్ మోదీ, నీరవ్ మోదీ పేర్లను ప్రస్తావిస్తూ దొంగలందరీకి మోదీ ఇంటి పేరే ఎందుకు ఉంది అంటూ రాహుల్ విమర్శించారు.
అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ తన మాటలతో మోదీ ఇంటి పేరున్న వారందరీ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్ తుది వాంగ్మూలం నమోదు చేసేందుకు జూన్ 24న కోర్టుకు హాజరుకావాల్సిందిగా సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గతవారం ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం సూరత్ కోర్టులో ప్రత్యక్షంగా హాజరైన రాహుల్.. మేజిస్ట్రేట్ ముందు తన చివరి స్టేట్మెంట్ ఇచ్చారు.