సోనియాతో ఆప్ రెబల్ ఎమ్మెల్యే భేటీ
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో ఆప్ రెబల్ ఎమ్మెల్యే ఇవాళ(సెప్టెంబర్-3,2019)భేటీ అయ్యారు. ఇప్పటికే ఆప్ అధిష్టానంపై కోపంగా ఉన్న అల్కా.. తన రాజకీయ భవిష్యత్పై దృష్టి సారించారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరపున చాందినీ చౌక్ నుంచి అల్కా పోటీ చేస్తారని తెలుస్తోంది.
సీఎం కేజ్రీవాల్పై బాహాటంగానే తీవ్ర వ్యాఖ్యలు చేసిన అల్కా.. ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. అల్కా రాజీనామా చేస్తే.. ఆమోదిస్తామని ఆప్ స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ ఓటమికి బాధ్యత తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ను అల్కా బాహాటంగా కోరడంతో పార్టీ ఎమ్మెల్యేల అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి ఆమెను తొలగించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని మొత్తం 7లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.