Padma Awards : పద్మ అవార్డులకు అర్హులెవరో సూచించండి..దేశ ప్రజలకు ప్రధాని విజ్ణప్తి
పద్మ అవార్డులకు అర్హులైన వారి పేర్లను ప్రభుత్వానికి సూచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు.
Padma Awards పద్మ అవార్డులకు అర్హులైన వారి పేర్లను ప్రభుత్వానికి సూచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు. సాధారణంగా పద్మ అవార్డుల కోసం రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ రంగాల్లో విశేష సేవ, కృషి చేసిన వారి పేర్లను కేంద్రానికి పంపుతుంటాయి. అయితే ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీ ఓ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ‘మంచి పనులు చేసిన వారి పేర్లను మీరే చెప్పండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ట్వీట్ చేశారు.
క్షేత్ర స్థాయిలో అసాధారణ కృషిచేసే అనేక మంది ప్రతిభావంతులు భారత్లో ఉన్నారు. అయితే వారి గురించి అందరికీ అంతగా తెలియదు. అటువంటి ఆదర్శవంతమైన వ్యక్తుల గురించి మీకు తెలుసా? అయితే వారి పేర్లను మీరు పద్మ పురస్కారాల కోసం నామినేట్ చేయవచ్చు. మీ నామినేషన్లను సెప్టెంబర్ 15 లోపు ఎప్పుడైనా పంపవచ్చు అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. పీపుల్స్ పద్మ అంటూ హాష్ ట్యాగ్ తో పేర్లను నామినేట్ చేయాల్సిన వెబ్ సైట్ ను ఆయన పోస్ట్ చేశారు. ఎవరికైనా ఎవరైనా తెలిసుంటే padmaawards.gov.in లో నామినేట్ చేయవచ్చు.
భారత్ లో అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మశ్రీ అవార్డులు ఒకటి. పద్’ పురస్కారాలను కేంద్రం 1954లో ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఆ అవార్డులను ప్రకటిస్తుంది. సమాజనికి విశిష్ట సేవలందించిన వారికి ఈ పురస్కారాలను (పద్మవిభూషణ్, పద్మభూషణ్,పద్మశ్రీ,) ప్రదానం చేస్తారు.