గాడ్ హెల్ప్ యు : నాగేశ్వరరావుపై సీజేఐ ఆగ్రహం
ఢిల్లీ : మాజీ సీబీఐ తాత్కాలిక చీఫ్ ఎం. నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది మోడీ గవర్నమెంట్ ఈయన్ను సీబీఐ తాత్కాలిక చీఫ్గా నియమించిన సంగతి తెలిసిందే. బీహార్ షెల్టర్ హోమ్ కేసును విచారిస్తున్న న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ అధికారిని ఎలా బదిలీ చేస్తారంటూ మండిపడింది. ఫిబ్రవరి 07వ తేదీ గురువారం దీనిపై విచారణ చేపట్టింది.
బీహార్ షెల్టర్ హోమ్ కేసును విచారిస్తున్న ఏకే శర్మను బదిలీ ఎలా చేస్తారు ? కోర్టు అనుమతి లేకుండా విచారణ అధికారిని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు ? సుప్రీంకోర్టు ఆదేశాలు ధిక్కరించారు…ఇక మిమ్మల్ని దేవుడే కాపాడాలంటూ సీజేఐ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. బదిలీలపై వివరణ ఇవ్వాలని పేర్కొన్న సీజేఐ…ఫిబ్రవరి 12న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ కేసును ఢిల్లీలోని పోక్సో కోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు.
గతంలో సీబీఐకి నాగేశ్వరరావు తాత్కాలిక డైరెక్టర్గా వ్యవహరించిన కాలంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీం ఆదేశించింది. సేవా సంకల్ప్లో 2018లో 30 మంది బాలికలపై నిర్వాహకులు అత్యంత పాశవికంగా అత్యాచారాలకు పాల్పడ్డారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేగాయి.
1986 బ్యాచ్కు చెందిన నాగేశ్వరరావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంగంపేట మండలం బోరు నర్సాపురం గ్రామం.
ఒడిశా క్యాడర్ అధికారి అయిన నాగేశ్వరరావు సీబీఐ జాయింట్ డైరెక్టర్గా పని చేశారు.
1986లో ఐపీఎస్గా ఎంపికయ్యారు.