పుల్వామా ఉగ్రదాడికి రెండేళ్లు.. 40మంది జవాన్లు అమరులైన రోజు

పుల్వామా ఉగ్రదాడికి రెండేళ్లు.. 40మంది జవాన్లు అమరులైన రోజు

Two years of Pulwama terror attack : పుల్వామా ఉగ్రదాడి జరిగి సరిగ్గా రెండేళ్లు పూర్తి అవుతోంది. ఇదే రోజున పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. జమ్మూ కశ్మీర్‌లో సైనిక బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడిలో సైనికులు నెలకొరిగారు. సరిగ్గా రెండేళ్ల కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక వాహన రేంజ్ పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40మంది జవాన్లు బలయ్యారు.

జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆత్మాహుతి దాడికి కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్‌ను వినియోగించారు. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఉగ్రవాది హతమయ్యాడు. పక్కా వ్యూహంతోనే సీఆర్పీఎఫ్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది అదిల్ తన వాహనాన్ని కాన్వాయ్‌కి ఎడమవైపు నుంచి ప్రవేశించాడు.

సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది ఎడమ వైపు నుంచి జవాన్ల వాహానాన్ని ఢీకొట్టాడు. పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ఉగ్రవాది, సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిలోని బస్సును ఢీకొట్టాడు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 10మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలని భారత్.. మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌ చేసింది. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వాయుసేన విమానాలు.. బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ వైమానిక దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. బాలాకోట్ ఎయిర్‌ స్ట్రయిక్స్ తర్వాత దాయాదుల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా సరిహద్దుల్లోని సైనిక స్థావరాలపై ఎఫ్-16 యుద్ధ విమానాలతో పాకిస్థాన్ దాడికి ప్రయత్నించింది. కానీ, భారత సైన్యం పాక్ సైన్యాన్ని సమర్ధంగా తిప్పికొట్టింది.