ఏం మాట్లాడుతున్నారు..ఉద్దవ్ ఠాక్రేపై యడియూరప్ప ఫైర్

ఏం మాట్లాడుతున్నారు..ఉద్దవ్ ఠాక్రేపై యడియూరప్ప ఫైర్

Uddhav Thackeray speech మహారాష్ట్ర ముఖ్యముంత్రి ఉద్దవ్‌ ఠాక్రే కార్యాలయం ఆదివారం చేసిన ట్వీట్‌ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య హాట్‌ టాపిక్‌గా మారింది. కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే కార్యాలయం చేసిన ఓ ప్రకటనపై సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఘాటుగా స్పందించారు. ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు దురదృష్టకరమని యడియూరప్ప అన్నారు.

మరాఠీ భాష,మరాఠీ సంస్కృతీ పేరుతో ఉద్దవ్ సరిహద్దు సమస్యను లేవనెత్తుతున్నారని..ఇది అనవసరమైనదని..సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని యడియూరప్ప అన్నారు. ఈ విషయంలో మహాజన్ కమిషన్ రిపోర్ట్ ఫైనల్ అని తెలిపారు. ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. కర్ణాటకలో.. కన్నడిగులు- మహారాష్ట్రీయులు సోదరులుగా ఐకమత్యంతో జీవిస్తున్నారని..ఉద్దవ్ వ్యాఖ్యాలు తనకు బాధ కలిగించాయని..ప్రజల్లో శాంతికి భంగం కలిగించేలా ఉన్న ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. నిజమైన భారతీయుడిగా సమాఖ్య స్ఫూర్తికి ఉద్దవ్ గౌరవం ఇవ్వాలి. వాటికి కట్టుబడి ఉండాలని యడియూరప్ప సోమవారం ట్వీట్‌ చేశారు.

కాగా, ఆదివారం ఉద్దవ్‌ ఠాక్రే కార్యాలయం చేసిన ట్వీట్‌ లో..కర్ణాటకలో మరాఠీ మాట్లాడే కొన్ని ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నాం. కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉన్న బెల్గాం తదితర సరిహద్దు ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు చాలా మంది ఉండగా ఆ ప్రాంతాలను తమ రాష్ట్రంలో చేర్చుకుంటామని మహారాష్ట్ర సీఎం తెలిపారు. ఆ ప్రాంతాలు తమ రాష్ట్రానికి చెందినవేనని.. వాటిని మహారాష్ట్రలో కలపాలని ఎన్నాళ్ల నుంచో మహారాష్ట్రలో డిమాండ్‌ ఉందన్నారు.

కాగా, ఇదే డిమాండ్‌పై మహారాష్ట్ర ఏకీకరణ సమితి సుదీర్ఘ కాలంగా పోరాడుతోంది. అయితే 1956 జనవరి 17వ తేదీన ఈ ఉద్యమంలో జరిగిన ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ జనవరి 17వ తేదీని మరాఠా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం ఆ ట్వీట్ చేసింది. కర్ణాటక అధీనంలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలపడమే అమరవీరులకు తాము అందించే ఘన నివాళి అని పేర్కొన్నారు.