కోవిడ్-19 వ్యాక్సినేషన్ : ఓటరు జాబితా ఆధారంగా ప్రియారిటీ లిస్ట్

కోవిడ్-19 వ్యాక్సినేషన్ : ఓటరు జాబితా ఆధారంగా ప్రియారిటీ లిస్ట్

Covid-19 vaccination దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంకి సంబంధించి రాష్ట్రాలకు సోమవారం(డిసెంబర్-14,2020) కేంద్ర ప్రభుత్వం 133 పేజీల గైడ్ లైన్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి ప్రాధాన్యం కింద కరోనా ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో పాటు 50ఏళ్లు పైబడినవారికి అంతకంటే తక్కువ వయసువారు ఉండి ఇతర రోగాలతో బాధపడుతున్నవారికి టీకా ఇవ్వాలని కేంద్రం సూచించింది.

కాగా, ఓటరు కార్డు ఆధారంగా 50ఏళ్లు దాటినవాళ్లను గుర్తించాలని కేంద్రం సూచించింది. అయితే, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూపొందించిన ఓటరు జాబితా ఆధారంగా 50 ఏండ్లు పైబడినవారిని గుర్తించాలని కోరింది. జనవరి-1,2021 కటాఫ్ డేట్ ఆధారంగా వయస్సుని లెక్కిస్తారు. జనవరి-1,1971న లేదా అంతకుముందు జన్మించినవారికి ప్రాధాన్యత క్రమంలో భాగంగా మొదటి దశలో వ్యాక్సిన్ అందించనున్నారు. ఎన్నికల ప్రాసెస్ మాదిరిగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని గైడ్ లైన్స్ లో కేంద్రం తెలిపింది. ఎన్నికల పోలింగ్ బూత్ ల మాదిరిగానే వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసి టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.

కోవిడ్-19 వ్యాక్సినేషన్ ని రియల్ టైమ్ లో మానిటర్ చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ అభివృద్ధి చేసిన డిజిటల్​ ప్లాట్​ఫాం “CO-WIN” ద్వారా లబ్ధిదారులు వ్యాక్సిన్ కోసం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కు అవకాశం లేదని సృష్టం చేసింది. ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని, నేరుగా సెంటర్ల దగ్గరకు వచ్చిన వారికి వ్యాక్సిన్ ఇవ్వకూడదని కేంద్రం గైడ్ లైన్స్ లో సృష్టం చేసింది.

ఫేజ్-1 వ్యాక్సినేషన్ లో మొత్తం దాదాపు 30కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కాగా, కరోనా వ్యాక్సిన్ కావాలనుకునే సాధారణ ప్రజలు CO-WIN వెబ్ సైట్ లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్‌ కార్డు, ఓటర్‌ కార్డు ఇలా ఏదేని ఒక గుర్తింపు కార్డుతో టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని గైడ్ లైన్స్ లో తెలిపింది.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు టీకాను ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్నప్రతి ఒక్క వ్యక్తిని 30నిమిషాల పాటు మానిటరింగ్ చేసి ఎవరికైనా ప్రతికూలిస్తే వెంటనే చికిత్స అందజేసేందుకు వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని కోరింది. కాగా, ఐదుగురు సభ్యులతో వ్యాక్సినేషన్ టీమ్ ఉండాలని… ఒక రోజులో ఒక్కో సెషన్ లో 100-200 మంది లబ్ధిదారులకి వ్యాక్సిన్‌ అందించే ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.

వివిధ రకాల వ్యాక్సిన్లతో గందరగోళం ఏర్పడకుండా నివారించేందుకు ఒక జిల్లాకు ఒకే సంస్థ టీకాను కేటాయించాలని తెలిపింది. వ్యాక్సిన్​ క్యారియర్లు, నిలువ చేసే బాక్సులు, ఐస్​ ప్యాక్​లు నేరుగా సూర్యరశ్మి తలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లబ్ధిదారుడు టీకా తీసుకునేందుకు కేంద్రానికి వచ్చే వరకు వ్యాక్సిన్​ ను క్యారియర్​ లోపలే ఉంచాలి. కొవిడ్​ టీకా లేబుల్​పై వ్యాక్సిన్​ వైయల్​ మానిటర్లు(వీవీఎం), గడువు ముగిసే తేదీ ఉండకపోయినా.. అలాంటి వాటిని వినియోగించకుండా పక్కన పెట్టకూడదు. టీకా పంపిణీ ముగిసిన తర్వాత అన్ని ఐస్​ ప్యాక్​లు, తెరవని వ్యాక్సిన్​ బాక్సులను తిరిగి కోల్డ్​ చైన్​ పాయింట్​కు పంపించాలి. వ్యాక్సినేషన్​ గురించి ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని గైడ్ లైన్స్ లో కేంద్రం పేర్కొంది.