Rahul Gandhi : న్యాయం జరిగే వరకూ వారికి అండగా ఉంటా

Rahul Gandhi : న్యాయం జరిగే వరకూ వారికి అండగా ఉంటా

Rahul2

Rahul Gandhi దేశ రాజ‌ధానిలో ఆదివారం అత్యాచారం, హ‌త్య‌కు గురైన 9 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప‌రామ‌ర్శించారు. ఉద‌యాన్నే బాధితురాలి ఇంటి వెళ్లిన రాహుల్‌..చిన్నారి కుటుంబ‌స‌భ్యులతో కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కేసు విష‌యంలో న్యాయం జ‌రిగే వ‌ర‌కు వారికి అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.

బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన అనంత‌రం మీడియాతో మాట్లాడిన రాహుల్.. ఆ కుటుంబంతో నేను మాట్లాడాను. వారు కోరుకునేది ఒక్కటే. తమ బిడ్డకు న్యాయం జరగాలని ఆరాటపడుతున్నారు. వారికి మేం అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకూ వారి తరఫున పోరాడతాం అని రాహుల్‌ హామీ ఇచ్చారు. బాధితురాలు కేవ‌లం ఆ కుటుంబానికి మాత్ర‌మే ఆడ‌బిడ్డ కాద‌ని, ఈ దేశానికి చెందిన ఆడ‌బిడ్డ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

మరోవైపు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఇవాళ బాధిత కుటుంబాన్ని కలిశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని వారికి కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అదేవిధంగా రూ.10లక్షల ఆర్థిక పరిహారాన్ని కూడా చిన్నారి కుటుంబానికి కేజ్రీవాల్ ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన అనంత‌రం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్..చిన్నారి కుటుంబాన్ని కలిశాను. ఆ చిన్నారి మరణం తీర్చేలేనిది. కానీ ఢిల్లీ ప్రభుత్వం రూ.10లక్షల పరిహారాన్ని ఆ కుటుంబానికి పరిహారంగా ఇస్తుంది మరియు ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశిస్తున్నాం. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తాం. టాప్ లాయర్లను నియమించి..నిందుతులకు కఠినశిక్ష పడేలా చూస్తాం అని కేజ్రీవాల్ తెలిపారు. మరోవైపు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్​పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

అసలేం జరిగింది
ఢిల్లీ కంటోన్మెంట్‌ ఏరియాలోని పాత నంగల్‌ గ్రామానికి చెందిన బాధితురాలి కుటుంబం శ్మశానానికి ఎదురుగా ఉన్న ఇంట్లో నివసిస్తోంది. ఆదివారం సాయంత్రం సమయంలో అక్కడ ఉన్న వాటర్‌కూలర్‌ నుంచి నీళ్లు తెస్తానని తల్లికి చెప్పి వెళ్లిన బాలిక ఎంతకీ తిరిగిరాలేదు. అరగంట తర్వాత కాటికాపరి రాధేశ్యామ్‌ ఆమె తల్లి వద్దకు వచ్చి బాలిక మరణించినట్లు చెప్పాడు. వాటర్‌ కూలర్‌ నుంచి నీళ్లు పడుతున్న సమయంలో విద్యుత్‌ షాక్‌ తగిలి బాలిక మరణించినట్లు చెప్పాడు. పోలీసులకు ఈ విషయం తెలిస్తే పోస్ట్‌మార్టం పేరుతో ఇబ్బంది పెడతారని, అవయవాలు దొంగతనం చేస్తారని చెప్పి హడావుడిగా బాలిక మృతదేహాన్ని దహనం చేయించాడు.

అయితే రాధేశ్యామ్‌ తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫోన్‌ చేశారు. తమ బిడ్డపై కాటికాపరి సహా మరికొందరు అత్యాచారం చేసి చంపేశారని ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ తమ ఇంటివద్దే న్యాయపోరాటం చేస్తున్నారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఓ పూజారితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నలుగురు నిందితులకు డ్రగ్స్ టెస్ట్,లై డిటెక్టర్ టెస్ట్ చేయనున్నట్లు సౌత్ ఈస్ట్ ఢిల్లీ డీసీపీ ఇంగిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు.