Nara Lokesh : భూకబ్జాలు, ఇసుక దందాలు, దేవుడిని కూడా వదల్లేదు- వైసీపీ ఎమ్మెల్యేపై లోకేశ్ తీవ్ర ఆరోపణలు

Nara Lokesh : ఆ బ్యాంక్ రూ.100 కోట్లు సేకరించి దుకాణం సర్దేసింది. బ్యాంకు పెట్టిన బినామీని పార్టీ నుండి సస్పెండ్ చేయించి డబ్బు మొత్తం కొట్టేశారు చీటింగ్ చక్రపాణి.

Nara Lokesh : భూకబ్జాలు, ఇసుక దందాలు, దేవుడిని కూడా వదల్లేదు- వైసీపీ ఎమ్మెల్యేపై లోకేశ్ తీవ్ర ఆరోపణలు

Nara Lokesh(Photo : Google)

Nara Lokesh-Silpa Chakrapani Reddy : భూకబ్జాలు, ఇసుక, ఎర్రమట్టి దందాలు, కమీషన్లు.. చివరికి దేవుడిని కూడా వదల్లేదు అంటూ వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై నిప్పులు చెరిగారు నారా లోకేశ్. నంద్యాల జిల్లా ఆత్మకూరులో బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే శిల్పా అక్రమాలు, దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావన్నారు లోకేశ్. ఓట్లేసి గెలిపించిన ప్రజలనే కాదు చివరికి దేవుడిని కూడా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

2019 ఎన్నికల్లో మీరు భారీ మెజారిటీతో శిల్పా చక్రపాణి రెడ్డిని గెలిపించారు. మరి, శ్రీశైలం ఏమైనా అభివృద్ధి చెందిందా? ఎవరి జీవితాలై మారాయా? అని లోకేశ్ అడిగారు. ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు, బంధువులు, అనుచరులు కలిసి శ్రీశైలంను దోచుకుంటున్నారుని ఆరోపించారు. భూకబ్జాలు, ఇసుక, ఎర్రమట్టి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు. అందుకే.. ఎమ్మెల్యే పేరుని మార్చా. శిల్పా చక్రపాణి కాదు చీటింగ్ చక్రపాణి. రూ.5లక్షల పనికి కూడా 10 శాతం తీసుకుంటున్నారు అంటే చీటింగ్ చక్రపాణికి ఎంత డబ్బు పిచ్చి ఉందో అర్ధం చేసుకోండి అన్నారు లోకేశ్.

”చీటింగ్ చక్రపాణి అని ఎందుకు అంటున్నానో చెబుతా. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే చీటింగ్ చక్రపాణి.. వర్ధన్ బ్యాంక్ ప్రారంభించారు. ఆ రోజు ఆయన ఏమన్నారో గుర్తుందా? వర్ధన్ బ్యాంక్ అంటే శిల్పా బ్యాంక్ అన్నారు. ఆ బ్యాంక్ రూ.100 కోట్లు సేకరించి దుకాణం సర్దేసింది. బ్యాంకు పెట్టిన బినామీని పార్టీ నుండి సస్పెండ్ చేయించి డబ్బు మొత్తం కొట్టేశాడు చీటింగ్ చక్రపాణి. 50శాతం సబ్సిడీతో రుణాలు ఇస్తామని దళితులను మోసం చేశారు ఈ చీటింగ్ చక్రపాణి.

Also Read..Minister KTR : కేరళ స్టోరీ సినిమాలాగే కర్ణాటక ఫలితాలు కూడా .. తెలంగాణలో అవి పనిచేయవ్ ..

డిపాజిటర్లకు నేను హామీ ఇస్తున్నా. వైసిపి నాయకులు దోచుకున్న డబ్బు కక్కిస్తాం. దేవుడిని కూడా వదలలేదు చీటింగ్ చక్రపాణి. శ్రీశైలం దేవస్థానాన్ని ఏటీఎంలా మార్చుకున్నారు. శ్రీశైలం దేవస్థానంలో తన ఏజెన్సీ ద్వారా కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల్లో భారీ అక్రమాలకు పాల్పడ్డారు.
హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డుల నియమాక టెండర్లు బంధువు రాజశేఖరరెడ్డికి కట్టబెట్టారు. వ్యాపారుల దగ్గర నుండి అక్రమ వసూళ్లు, అక్రమంగా షాపుల ఏర్పాటు, లడ్డూ తయారీలో అక్రమాలకు పాల్పడి దేవుడి సొమ్ము కాజేస్తున్నారు వైసిపి నాయకులు. నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం టికెట్ల దగ్గర నుండి ప్రసాదం వరకూ వైసిపి నేతల దోపిడీ జరుగుతోంది.

కృష్ణాపురం గ్రామంలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన 40 ఎకరాల భూమిని చీటింగ్ చక్రపాణి అనుచరుడు పుల్లారెడ్డి కబ్జా చేసి అమ్మేసుకున్నాడు. శ్రీశైలంలో ఎవరు రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్యాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా చీటింగ్ చక్రపాణి తమ్ముడు శిల్పా భువనేశ్వర రెడ్డికి 10 శాతం కప్పం కట్టాల్సిందే.

శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో చీటింగ్ చక్రపాణి అనుచరులు వడ్డి వెంకటరెడ్డి, గుండయ్య ఇరిగేషన్ భూములు పది ఎకరాలకు పైగా కబ్జా చేశారు. లాడ్జ్ లు కూడా కట్టేసారు. సున్నిపెంటలో డ్రైవర్ అసోషియేషన్ భూములు ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మేశారు చీటింగ్ చక్రపాణి అనుచరులు.
ఆత్మకూరులో చీటింగ్ చక్రపాణి అనుచరుడు అంజాద్ అలీ రూ.10 కోట్లు విలువ చేసే అసైన్డ్ భూములను కబ్జా చేశాడు. సర్వే నంబర్ 825/ఏ1 లో ఉస్సేన్ సాహెబ్ కి చెందిన భూమిని అంజాద్ అలీ కబ్జా చేశాడు. బాధితుడు ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆత్మకూరులో గుండ్లమ్మ వాగును చీటింగ్ చక్రపాణి అనుచరులు ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మేశారు.

మహానంది మండలం అంకిరెడ్డి చెరువు ఎర్రమట్టిని వైసీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి అక్రమంగా తవ్వేశారు. బండి ఆత్మకూరు వద్ద కుందూ నదిలో ఇసుకను చీటింగ్ చక్రపాణి అనుచరులు అక్రమంగా దోచేస్తున్నారు. ప్రభుత్వ డిపోల నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు చీటింగ్ చక్రపాణి స్నేహితుడు ప్రభాకర్ రెడ్డి. చీటింగ్ చక్రపాణి అనుచరుడు రమేశ్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.

Also Read..Pawan Kalyan : సీఎం పదవి, పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

వైసిపి వేసిన సిట్ తోనే విచారణ చేయించి వైసిపి నాయకులు దోచుకున్న డబ్బు మొత్తం రికవరీ చేస్తాం. బండి ఆత్మకూరు మండలంలో అటవీ సమీప ప్రాంతాల్లో ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. చీటింగ్ చక్రపాణి శ్రీశైలం ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? నాది అంబేద్కరిజం. జగన్ ది సైకోయిజం. మీరు అంబేద్కర్ వైపు ఉంటారా? సైకో వైపు ఉంటారా తేల్చుకోండి. శ్రీశైలం గడ్డపై పసుపు జెండా ఎగరడం ఖాయం” అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ.. కార్యకర్తల పార్టీ అయితే, జగన్ రెడ్డిది దొంగలు, డెకాయిట్ల పార్టీ అని విమర్శించారు. చంద్రబాబు విజనరీ.. జగన్ ప్రిజనరీ అంటూ ఎద్దేవా చేశారు. మనది కియా.. వాళ్ళది కోడి కత్తి అన్నారు. నాలుగేళ్లలో ప్రిజనరీ చేసిందేమీ లేదన్నారు. జగన్ ఒక పిరికోడు అందుకే మీ లోకేశ్ ని అడ్డుకోవడానికే జీవో 1 తెచ్చాడని అన్నారు.