Tirumala Darshan : జనవరి నెలలో సిఫార్సు లేఖలు అనుమతించబడవు.. ఏఏ రోజుల్లో అంటే……
సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరం రోజు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు సిఫార్సు లేఖలను అనుమతించమని
Tirumala Darshan : సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరం రోజు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు సిఫార్సు లేఖలను అనుమతించమని టీటీడీ తెలిపింది. ఈ రోజుల్లో స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుందని తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పని సరిగా తీసుకురావాలని టీటీడీ కోరింది.
శ్రీవారి ఆలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా విచ్చేసే భక్తులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంతృప్తికరమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపడుతోంది. ఈ పర్వదినాల నేపథ్యంలో జనవరి 13 నుండి 22వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది.
మరో వైపు జనవరి 11 నుండి 14వ తేదీ వరకు వసతి గదుల ఆడ్వాన్స్ రిజర్వేషన్ను కూడా టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేస్తూ తిరుమలలోని అన్ని గదులను కరెంటు బుకింగ్ ద్వారా కేటాయించాలని టిటిడి నిర్ణయించింది. జనవరి 11 నుండి 14వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్ ఉండదని పేర్కోంది.
కళ్యాణ కట్టలో తలనీలాలు తీసేందుకు తగినంత మంది క్షురకులను అందుబాటులో ఉంచారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ క్షురకులు పిపిఇ కిట్లు, ఆప్రాన్లు వినియోగిస్తారు. అన్నప్రసాద భవనంలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈ 10 రోజుల పాటు ఉదయం 4 నుండి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుందని టీటీడీ తెలిపింది. భక్తులకు వైద్యసేవలందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో పోలీసులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాలు పార్కింగ్ ప్రాంతాలకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : Sankranti 2021 : సంక్రాంతి రద్దీ..జనవరి రెండో వారం వరకు స్పెషల్ రైళ్లు ఫుల్
ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. అదేవిధంగా, కొన్ని పట్టణాల్లో రాత్రి కర్ఫ్యూ కూడా విధించారు. ఈ నేపథ్యంలో భక్తులు పర్వదినాల్లోనే కాకుండా మిగతా అన్ని రోజుల్లోనూ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేయించుకున్న ఆర్టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.