WTC Final: ఆరవ రోజు.. ఆఖరి రోజు.. 18వికెట్ల దూరంలో గెలుపు?
భారత్, తొలి సెషన్ వరకు వేగంగా ఆడి ప్రత్యర్థికి లక్ష్యం విధిస్తుందా? లేక డ్రా కోసం ప్రయత్నిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. భారత్ గెలుపు కోసం చూస్తే మాత్రం మొత్తం 18వికెట్లు ఈరోజు పడాల్సి ఉంటుంది.
Ind vs NZ WTC Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్.. సౌతాంప్టన్లో సాగుతోంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో, ఐదవ రోజు న్యూజిలాండ్ జట్టు 249 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా కివీస్ జట్టుకు 32 పరుగుల ఆధిక్యం సాధించింది. ఐదవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసి 32 పరుగుల ఆధిక్యంలో ఉంది. విరాట్ కోహ్లీ 8 పరుగులు చేయగా, చేతేశ్వర్ పుజారా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఫైనల్ మ్యాచ్ కావడంతో రిజర్వ్ డే ఉండగా.. ఆరవ రోజు కూడా మ్యాచ్ జరుగుతోంది. ఆరవ రోజు మొత్తం ఆట జరుగుతుందా? జరిగినా ఫలితం తేలుతుందా? అనేది ఇప్పుడు ప్రశ్నే. రెండో ఇన్నింగ్స్లో టీమ్ ఇండియా ఓపెనర్ బ్యాట్స్మన్ షుబ్మాన్ గిల్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్లో 81 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక భారత్ చేతిలో 8వికెట్లు మాత్రమే ఉండగా.. భారత్, తొలి సెషన్ వరకు వేగంగా ఆడి ప్రత్యర్థికి లక్ష్యం విధిస్తుందా? లేక డ్రా కోసం ప్రయత్నిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. భారత్ గెలుపు కోసం చూస్తే మాత్రం మొత్తం 18వికెట్లు ఈరోజు పడాల్సి ఉంటుంది.
రెండో ఇన్నింగ్స్లో కూడా కివీస్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. రోహిత్, గిల్ వికెట్ కాపాడుకునేందుకు ఎంత ప్రయత్నించినా.. సౌతీ ముందు లొంగిపోయారు. రెండు వికెట్లనూ సౌతీనే తీశాడు. ఇక ఆఖరి రోజు మొత్తం ఏ ఆటంకం లేకుండా జరిగితే 98ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. 98ఓవర్ల మ్యాచ్లో జట్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఖచ్చితంగా చెప్పలేము అంటున్నారు నిపుణులు. వేగంగా ఆడి టార్గెట్ ఇచ్చినా.., న్యూజిలాండ్ 10వికెట్లు తీయడం అంటే కష్టమైన పని అని భావిస్తే మాత్రం.. డ్రా చెయ్యాలని జట్టు భావించొచ్చు. మ్యాచ్ డ్రా కావడానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే, రెండు జట్లు కప్ను పంచుకునే అవకాశం ఉంది.