తెలంగాణలో మరో ప్రణయ్ దారుణ హత్య, ప్రేమ వ్యవహారమే కారణం

  • Published By: naveen ,Published On : October 21, 2020 / 11:39 AM IST
తెలంగాణలో మరో ప్రణయ్ దారుణ హత్య, ప్రేమ వ్యవహారమే కారణం

pranay murder: అతడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ రోజు రాత్రి ఫోన్‌ రావడంతో మాట్లాడేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే అప్పటికే అతడి కోసం మాటు వేసిన దుండగులు.. కర్రలు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రాణం తీసి డెడ్‌బాడీని మరోచోట పడేసి పరారయ్యారు. ఈ హత్యతో పచ్చని పల్లె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతకీ అతడికి ఫోన్‌ చేసిందెవరు..? చంపిందెవరు.? అప్పుడప్పుడే చీకటి పడుతోంది.. ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండిపోయారు.. ఆ సమయంలో ఎవరూ ఊహించని ఘటన.. ఊరి నడిబొడ్డున ఓ యువకుడు దారుణ హత్య.. కర్రలు, గొడ్డళ్లు చేతబట్టి కిరాతకంగా కడతేర్చారు.. హత్యతో ఆ ఊరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది..

డెడ్ బాడీ చూసి ఉలిక్కిపడిన జనం:
ఎవరు చంపారు..ఎందుకు చంపారు..యువకుడి డెడ్‌బాడీని చూసిన ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరి నోటి వెంట ఇదే మాట. పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హత్య జరిగిన ప్రాంతంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలనూ పరిశీలించారు. కాసేపటికి వరకు ఆ హత్య వెనుకున్న మిస్టరీ పోలీసులకు సైతం అంతు చిక్కలేదు. ఆ తర్వాత ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అమ్మాయితో మాట్లాడుతుండగా దాడి.. కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసి హత్య:
దారుణ హత్యకు గురైన యువకుడి పేరు ప్రణయ్‌. స్వస్థలం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి. సోమవారం(అక్టోబర్ 19,2020) రాత్రి ఓ అమ్మాయితో ప్రణయ్‌ మాట్లాడుతుండగా గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా ఎటాక్‌ చేశారు. ముందు కర్రలతో దాడి చేసి ఆ తర్వాత గొడ్డళ్లతో అత్యంత కిరాతంగా నరికి చంపారు. అనంతరం డెడ్‌బాడీని అంబేద్కర్ భవన్ దగ్గర పడేసి వెళ్లిపోయారు.

ప్రణయ్‌ హత్య వెనుక ప్రేమ వ్యవహారం?
రక్తపు మడుగులో ప్రణయ్‌ మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…ఆ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా..ప్రణయ్‌ హత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు.

వనిత, ప్రణయ్‌ మధ్య ఎనిమిదేళ్లుగా ప్రేమ, వ్యతిరేకించిన యువతి కుటుంబసభ్యులు:
ప్రణయ్..అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు కాగా…కలిసి చదువుకుంటున్న సమయంలో ప్రేమ చిగురించింది. ఇద్దరి కులాలు ఒక్కటే అయినా… వారి ప్రేమను యువతి కుటుంబసభ్యులు వ్యతిరేకించారు. ఈ విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. సీన్‌ కట్‌ చేస్తే…ప్రణయ్‌కి సోమవారం రాత్రి ప్రియురాలి నుంచి ఫోన్ రావడంతో బయటకు వెళ్లాడు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు…కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసి ప్రణయ్‌ను చంపేశారు.

హత్య వెనుక యువతి సోదరుడు అనిల్:
ప్రణయ్ మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. యువతి సోదరుడు అనిల్‌…పథకం ప్రకారం ప్రణయ్‌ను హత్య చేశాడని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. ప్రేమిస్తే చంపేస్తారా అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ప్రణయ్‌ హత్య వెనుకున్న ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం:
మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు..పూర్తి స్థాయి విచారణ అనంతరం హంతకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓ పల్లెలో చోటు చేసుకున్న ఈ ప్రేమ హత్య…కలకలం రేపింది. స్థానిక ప్రజల్ని భయాందోళనకు గురి చేసింది.

ప్రేమ హత్యలు, పరువు హత్యలు, ప్రేమోన్మాదుల దాడులు:
తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రేమ హత్యలు, పరువు హత్యలు, ప్రేమోన్మాదుల దాడులు కలకలం రేపుతున్నాయి. గతంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి మరీ ప్రణయ్ ని హత్య చేయించారు. ప్రణయ్, అమృత కులాలు వేరు. దీంతో తన పరువు తీశాడనే కోపంతో ప్రణయ్ ని అతి దారుణంగా చంపించాడు మారుతీరావు.