RS Praveen Kumar : నేడు బీఎస్పీలో చేరనున్న ఆర్ఎస్.ప్రవీణ్కుమార్..నల్గొండలో భారీ బహిరంగ సభ
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ నేడు బీఎస్పీలో చేరనున్నారు. ఇవాళ నల్లగొండలో జరిగే బహిరంగ సభలో ప్రవీణ్కుమార్ బీఎస్పీలో అధికారికంగా చేరనున్నారు. ఇటీవలే గురుకుల కార్యదర్శి పదవికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
RS Praveen Kumar join BSP : మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ నేడు బీఎస్పీలో చేరనున్నారు. ఇవాళ నల్లగొండలో జరిగే బహిరంగ సభలో ప్రవీణ్కుమార్ అధికారికంగా బీఎస్పీలో చేరనున్నారు. ఇటీవలే గురుకుల కార్యదర్శి పదవికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సొంతంగా పార్టీ పెడతరా లేదా ఇతర అధికార పార్టీలో చేరుతారన్న వదంతులు వచ్చాయి. కానీ ఆయన బీఎస్పీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే ఆదివారం నల్లగొండలో జరిగే బహిరంగ సభలో బీఎస్పీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు.
బీఎస్పీ ఆధ్వర్యంలో ఇవాళా నల్లగొండలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి బహుజన సమాజ్పార్టీ కార్యకర్తలు, స్వేరోలు, ప్రవీణ్కుమార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో సాయంత్రం 4గంటలకు సభ జరుగనుంది. రాజకీయ పార్టీలకు భిన్నంగా కార్యకర్తలు కూర్చునే విధంగా కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. సభాస్థలిలో ప్రవీణ్కుమార్, ముఖ్య అతిథులతో కూడిన ఫొటోలతో భారీ కట్ అవుట్లను ఏర్పాటు చేస్తున్నారు.
బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్ హాజరవుతున్నారు. అలాగే రాష్ట్ర , తెలంగాణ జిల్లాల ఇన్చార్జ్లు, జిల్లాకు చెందిన బీఎస్పీ నేతలు కూడా హాజరుకానున్నారు. బహిరంగ సభ రోజు ఉదయం డాన్బోస్కో నుంచి నల్లగొండ టౌన్లోకి స్వేరోల ఆధ్వర్యంలో 1000 మందితో ఫిట్ ఇండియా 5కే రన్ నిర్వహించనున్నారు. పోలీసులు కూడా సభాస్థలితో పాటు పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు నల్లగొండ పట్టణ సమీపంలోని అద్దెంకి బైపాస్ వద్ద ముఖ్య అతిథులకు కార్యకర్తలంతా స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి డప్పు కళాకారులు , కోలాట కళాకారులతో ర్యాలీ ప్రారంభం కానుంది. రెండు గంటలపాటు ర్యాలీ నిర్వహించనున్నారు. తర్వాత 4గంటలకు ఎన్జీ కాలేజీ సభ స్థలి చేరుకుంటారు.
బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్, ఆర్ఎస్పీ రాజకీయ సంకల్ప సభకు కన్వీనర్ పూదరి సైదులు ఆధ్వర్యంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు ఎలాంటి వాహనాలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అభిమానులు, స్వేరో కార్యకర్తలంతా స్వచ్ఛందంగానే సభకు హాజరవుతారని తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సభను నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. శానిటైజర్, మాస్కులు తప్పనిసరి, సమావేశం పూర్తయిన తర్వాత కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా సభ జరుగనుందని సైదులు వెల్లడించారు.