వ్యాక్సిన్ వద్దన్నారా..అయితే మళ్లీ వేయరు

వ్యాక్సిన్ వద్దన్నారా..అయితే మళ్లీ వేయరు

corona vaccination process : కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు భారతదేశం తీసుకొచ్చిన వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. కానీ..నిర్దేశించిన లక్ష్యాన్ని మాత్రం చేరుకోవడం లేదు. దీనికి కారణం..కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి కొంతమంది నిరాకరించడమే. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. జాబితాలో పేరుండి..నిర్దేశిత రోజున వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎవరైనా నిరాకరిస్తే..వారికి మరోసారి టీకా వేసే అవకాశం ఇవ్వరాదని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వ్యాక్సిన్ వేసుకోవడానికి కేటాయించిన రోజు రాకపోతే…అందుబాటులో ఉన్న ఇతర అర్హులైన వారికి వేయాలని..తద్వారా..వేగంగా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.

కోవిన్ యాప్ లో ఎంతమందికి టీకా వేయాలన్న వివరాల జాబితా..సంబంధిత అధికారి వద్ద ఉంటుంది. ఎవరికి ఎప్పుడు వేయాలో, తేదీ, టైం, స్లాట్ ప్రకారం లబ్దిదారుల ఫోన్లకు మెసేజ్ లు వెళుతాయి. ఆ ప్రకారం లబ్దిదారులు కేంద్రానికి రావాల్సి ఉంటుంది. కానీ..చాలా మంది గైర్హాజర్ అవుతున్నారు. వీరి స్థానంలో అప్పటికప్పుడు అర్హులైన ఇతర లబ్దిదారులకు టీకా వేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. అదేరోజు వ్యాక్సిన్ వేసుకున్నట్లు కోవిన్ సాప్ట్ వేర్ వివరాలను నమోదు చేస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బందికి టీకాలు వేసే సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇదే పద్ధతిని పాటించాలని, సాధారణ ప్రజలకు వేసేక్రమంలో..ఇలాగే ఉండవచ్చునని అంటోంది.

టీకా వేసుకోబోమని ఎవరైనా వచ్చి తిరస్కరిస్తే..దానిని కోవిన్ యాప్ లో నమోదు చేస్తారు. అలా ఒకసారి తిరస్కరిస్తున్నట్లు యాప్ లో నమోదైతే…మరోసారి వారికి టీకాలు వేసే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. యాప్ ను ఆ విధంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. ప్రస్తుతం వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ లు వేస్తున్నారు. చాలాచోట్ల ఆ రోజు నిర్దేశించిన జాబితాలోని వారందరూ…రావడం లేదు. కొన్ని చోట్ల 60 శాతం, మరికొన్ని చోట్ల 70 శాతం మందికి టీకాలు వేస్తున్నారు. మరికొందరు తీసుకోవడానికి తిరస్కరిస్తున్నారు. అందుకే ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది.