Telangana Lockdown : తెలంగాణలో లాక్డౌన్..? మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా కట్టడికి ప్రభుత్వం..
Telangana Lockdown : తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా కట్టడికి ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Corona Treatment : 50 ఎకరాలు అమ్మి రూ.8 కోట్లు ఖర్చు.. అయినా దక్కని ప్రాణం
రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో నిర్వహించిన #askktr లో భాగంగా ఓ నెటిజన్ లాక్ డౌన్ గురించి ప్రశ్నించాడు. తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నందున రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారా? లేక నైట్ కర్ఫ్యూ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఏమైనా ఉందా? అని నెటిజన్ అడిగాడు. దానికి కేటీఆర్ స్పందించారు. కరోనా కేసుల సంఖ్య, వైద్యశాఖ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చే సలహాను బట్టి లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
It will all depend on the number of cases and how the health officials advice the government https://t.co/jVIQM3kxKI
— KTR (@KTRTRS) January 13, 2022
కాగా, తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్నటితో(2,319) పోలిస్తే ఈ రోజులు కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 84వేల 280 శాంపిల్స్ పరీక్షించగా… 2,707 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,328 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 248, రంగారెడ్డి జిల్లాలో 202 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో మరో ఇద్దరు కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో మరో 582 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,02,801 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,78,290 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 20వేల 462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,049కి పెరిగింది.