Cheating Case: ఆమె ఎంబీబీఎస్ డాక్టర్.. కానీ స్వామీజీ మాయలో పడి..
మంత్రాలకు చింతకాయలు రాలవని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ, ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా..
Cheating Case: మంత్రాలకు చింతకాయలు రాలవని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ, ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా ముర్ఖంగా స్వామీజీల మాయలో పడి మోసపోతున్నారు. ఇప్పుడు మీరు చదివే స్టోరీ కూడా అలాంటిదే. ఆమె ఎంబీబీఎస్ డాక్టర్. కానీ స్వామీజీ మాయలో పడి నిలువునా మోసపోయింది. పశ్చిమబెంగాల్కు చెందిన ఓ 41 ఏళ్ల మహిళ ప్రస్తుతం కొండాపూర్లో ఉండగా 2011లోనే ఆమె విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని స్వదేశానికొచ్చింది.
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసుకున్న వారు మన దగ్గర ప్రాక్టీస్ చేయాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE) పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. ఆ మహిళ ఎఫ్ఎంజీఈ పరీక్ష ఎన్నిసార్లు రాసినా పాస్ కాకపోవడంతో ఆన్ లైన్ లో ఓ ప్రకటన చూసి ‘బిస్వజిత్ ఝా’ అనే ఓ స్వామీజీని కలిసింది. ఓ పూజ చేస్తే చాలు నువ్వు ఎలాంటి పరీక్ష అయినా సింపుల్ గా పాస్ అవుతావని నమ్మబలికిన స్వామీజీ అందుకు ముందుగా రూ.21,500 డబ్బు తన బ్యాంకు ఖాతాలో జమ చేయించుకున్నాడు.
స్వామీజీ పూజ అనంతరం గతేడాది డిసెంబర్లో జరిగిన పరీక్షలో ఆమె పాస్ కాలేదు. దీంతో ఆమె స్వామీజీని ఇలా ఎందుకు జరిగిందంటూ నిలదీసింది. దీంతో స్వామీజీ ఎక్కడో పూజలో లోపం జరిగిందని ఈసారి కాలభైరవ ప్రత్యేక పూజ చేస్తే పాస్ కావడమే కాదు మంచి స్కోర్ కూడా వస్తుందని నమ్మబలికి మరో రూ.60 వేలు అడిగాడు. ఆ డబ్బును కూడా స్వామీజీకి పంపిన ఆమె ఈ ఏడాది పరీక్షకు హాజరైంది. కానీ ఆమె పాస్ కాలేదు. ఎందుకిలా జరిగిందని అడిగినా స్వామీజీ నుండి ఎలాంటి ఆన్సర్ లేదు. దీంతో ఆమె గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగితే పదుల సంఖ్యలో ఉన్నత విద్యావంతులు ఈ స్వామీజీ వలలో పడి మోసపోయినట్లు తేలింది.