సైబర్ క్రైమ్ కేసులొస్తున్నాయి.. సిబ్బందేలేరు

సైబర్ క్రైమ్ కేసులొస్తున్నాయి..  సిబ్బందేలేరు

Staff shortage in the cybercrime department : నానాటికీ సైబర్ క్రైమ్ రేట్ పెరిగి పోతోంది. పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కానీ, అదేస్థాయిలో విచారణ జరపాల్సిన సిబ్బందిని మాత్రం కొరత వేదిస్తోంది. దీంతో.. నూతన ఏడాదిలోనైనా రిక్ర్యూట్‌మెంట్‌ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా..? అనే చర్చ ఆసక్తికరంగా మారింది.

2017లో 325 కేసులు..2018లో 428 కేసులు..2019లో 1393 కేసులు..2020 డిసెంబర్‌ నాటికి 2,456 కేసులు..ఒక్కమాటలో చెప్పాలంటే.. హైదరాబాద్‌లో పెరిగిన సైబర్‌ క్రైమ్‌ రేట్‌ అది. రోజుకు వందల సంఖ్యలో ఫిర్యాదులు సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌ తలుపు తడుతున్నాయ్‌. కేసులను సమర్ధవంతంగా విచారించాల్సిన సిబ్బంది మాత్రం తక్కువగానే ఉన్నారు. మరోవైపు.. అన్ని సైబర్‌ పోలీస్‌ స్టేషన్లలతో సైబర్‌ క్రైమ్‌ టీమ్స్ లేవు.

భాగ్యనగరంలో సైబర్‌ క్రైమ్‌ కోసం 58 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. పదేళ్ల క్రితం నాటి కేటాయింపులతోనే సైబర్‌ క్రైమ్‌ స్టేషన్ నెట్టుకు వస్తుంది. దీంతో సిబ్బందిపై పనిభారం ఎక్కువగా ఉంది. 2010లో సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దానికి ప్రాథమికంగా 40 మంది సిబ్బందిని కేటాయించడంతో పాటు.. రెండు సైబర్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఒక్కో టీమ్‌కు ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. ఆ టీమ్‌లో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులను నియమించింది ప్రభుత్వం.

పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఆ వ్యవస్థలో పెరిగిన సిబ్బంది సంఖ్య కేవలం ఎనిమిది మాత్రమే. సైబర్‌ నేరాలు కొత్తపుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో తక్కువ మంది సిబ్బందితో ఉన్న ఆ శాఖ అల్లాడిపోతోంది. డెబిట్, క్రెటిట్‌ కార్డుల ఫ్రాడ్స్‌తో పాటు హ్యకింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నిత్యం వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయ్. ఇప్పుడు కొత్తగా మనీలోన్‌ యాప్‌ల కేసులు కూడా పెరుగుతుండటం.. పోలీసు సిబ్బందిని ఇబ్బంది పెడుతోంది.

హైదరాబాద్‌ సిటీ సైబర్ క్రైమ్‌ స్టేషన్‌కు మరో 19 మంది సిబ్బందిని కేటాయించాలని కోరుతూ.. అధికారులు రెండేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ముగ్గురు ఇన్‌స్పెక్టర్లతో పాటు ఆరుగురు ఎస్సైలు, పది మంది కానిస్టేబుళ్లను కోరారు. ఇప్పటివరకూ వాటికి మోక్షం కలగలేదు. నూతన ఏడాదిలోనైనా సిబ్బంది కొరత తీరుతుందని పోలీసుశాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.