Congress Dharna : కాంగ్రెస్ ధర్నా… నేతలు ముందస్తు అరెస్ట్
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో రాజ్భవన్ ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులను హైదరాబాద్ కు తరలిరావాలని నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచి బయలు దేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
Congress Dharna : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో రాజ్భవన్ ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులను హైదరాబాద్ కు తరలిరావాలని నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచి బయలు దేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
ధర్నా చౌక్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకున్నారు. ఇందుకోసం రెండు రోజుల క్రితం హైదరాబాద్ పోలీసు కమీషనర్ అంజన్ కుమార్ యాదవ్ ను అనుమతి కూడా కోరారు. అయితే ప్రస్తుతం ఉన్న కోవిడ్ నిబంధనల మేరకు ధర్నా చౌక్ వద్ద 200 మంది సమావేశం అవటానికి మాత్రమే అనుమతి ఇస్తూ సీపీ అంజన్ కుమార్ యాదవ్ అనుమతిచ్చారు.
మరోవైపు ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు.ధర్నా చౌక్ నుంచి రాజ్ భవన్ కు వెళ్లే రహదారులన్నింటిని పోలీసులు దిగ్భందనం చేశారు. పోలీసులు చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కోసం అనుమతి దరఖాస్తు చేశామని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి తెలిపారు. ఇలా పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం రాజరిక పాలనకు నిదర్శనమని.. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవరహరిస్తోందని మల్లు రవి ఆరోపించారు.
అటు వికారాబాద్ జిల్లా పరిగిలో కూడా కాంగ్రెస్ శ్రేణులను కూడా పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. నాయకులు ఇల్లు దాటి బయటకు రాగానే పోలీసులువారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం నియంత్రుత్వ ధోరణికి నిదర్శనమని అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని మల్లురవి డిమాండ్ చేశారు.
యుపిఏ హయాంలో అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే బీజేపీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేసి గగ్గోలు పెట్టిందన ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఇప్పుడు అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువగా ఉంటే మోడీ ప్రభుత్వం అధికంగా వసూలు చేస్తోందని ఆమె చెప్పారు. 40 రూపాయలకు దొరికే పెట్రోల్కు 65 రూపాయలు అదనంగా పెంచి మోడీ ప్రభుత్వం అమ్ముతోందని…కరోనా పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం నిత్యావసర ధరలు పెంచిందని… ఇవి సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపాయని సీతక్క అన్నారు.