అప్పు తీర్చడం లేదని తల్లిని చంపిన కుమార్తె..
The daughter who killed her mother : కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మంటగలిసింది. తన వద్ద తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని కుమార్తె తల్లిని హత్య చేసింది. ఈ ఘటన బిచ్కుంద మండలంలో దౌల్తాపూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. దౌల్తాపూర్ గ్రామానికి చెందిన షెట్టి శివవ్వ (70)కు బాయమ్మ ఒక్కతే కుమార్తె. అదే గ్రామానికి చెందిన వ్యక్తితో బాయమ్మకు వివాహం జరగ్గా భర్తతో విబేధాలు రావడంతో గత కొన్ని సంవత్సరాలుగా తల్లి వద్దే ఉంటోంది.
ఈ క్రమంలో కూతురు బాయమ్మ వద్ద శివవ్వ రూ.12 వేలు అప్పుగా తీసుకుంది. ఈ డబ్బుల విషయంలో తరచూ తల్లీకూతుళ్లకు మధ్య గొడవ జరుగుతుండేది. ఆదివారం రాత్రి సైతం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా విచక్షణ కోల్పోయిన బాయమ్మ తల్లిని పదునైన ఆయుధంతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.