కాగ్నిజెంట్ కంపెనీకి స్వాగతం.. రూ.1583 కోట్ల పెట్టుబడి.. 8 వేల ఉద్యోగాలు: లోకేశ్
ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్ను కాగ్నిజెంట్ ఏర్పాటు చేయనుంది.

కాగ్నిజెంట్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ స్వాగతం పలుకుతోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏపీ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 ద్వారా పర్యావరణ ఐటీ వ్యవస్థ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
భారత ఐటీ దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒక్కటైన కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ విశాఖపట్నంలో రూ.1583 కోట్ల పెట్టుబడి పెట్టనుందని చెప్పారు. 21.3 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ క్యాంపస్ ద్వారా 8 వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. కాగ్నిజెంట్కు ఎకరా భూమిని కేవలం 99 పైసలకు కేటాయిస్తున్నామని చెప్పారు.
కాగా, విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ రూ.1,582 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. ఈ కంపెనీకి 99 పైసలకే ఎకరా భూమి కేటాయించేందుకు ఇప్పటికే నిర్ణయించారు. ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్ను కాగ్నిజెంట్ ఏర్పాటు చేయనుంది.
అలాగే, కాపులుప్పాడ వద్ద తమకు 21.31 ఎకరాలు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. 2029 మార్చిలోగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని కాగ్నిజెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టీసీఎస్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు కోసం కూడా ఏపీ సర్కారు భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. ఆ కంపెనీకి రుషికొండలో 21.6 ఎకరాలను సర్కారు కేటాయించింది. ఆ కంపెనీకి కూడా ఎకరాకు 99 పైసలకే లీజు ఇవ్వనుంది.