AP Govt : విద్యుత్ ఉద్యోగులతో చర్చలు సఫలం.. పీఆర్సీకి ప్రభుత్వం అంగీకారం
విద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకు అటు యాజమాన్యం, ఇటు ఉద్యోగులు ఎంతోకొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో మంత్రులు, అధికారులు ఉద్బోధించారు. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు.

AP Govt PRC
AP Govt Agreed PRC : విద్యుత్ ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. ఎట్టకేలకు ప్రభుత్వం పేరివిజన్ కమిషన్(పీఆర్సీ)కి అంగీకారం తెలిపింది. ఒప్పందంపై యాజమాన్యం, ఉద్యోగ సంఘాల సంతకాలు చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(ఏపీఎస్పీఈజేఏసీ) సమ్మె నోటీసు ఉపసంహరించుకుంది. దీంతో విద్యుత్ ఉద్యోగులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. పీఆర్సీలో భాగంగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఆగస్టు 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఏపీఎస్పీఈజేఏసీ నోటీసు ఇచ్చిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో ఏపీఎస్పీఈజేఏసీ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సచివాలయంలో చర్చలు జరిపింది. ఇది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని, అందరికీ మేలు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడి మంచి నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర ఇంధన, అటవీ పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Janasena Leaders : పవన్ కు మంత్రి గుడివాడ పది ప్రశ్నలపై జనసేన నేతలు కౌంటర్
విద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకు అటు యాజమాన్యం, ఇటు ఉద్యోగులు ఎంతోకొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో మంత్రులు, అధికారులు ఉద్బోధించారు. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. ఈమేరకు పీఆర్సీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఏపీ ట్రాన్స్కో, ఏపీజెన్కో, ఏపీసీపీడీసీఎల్, ఈపీడీసీఎల్, స్పీడీసీఎల్ అధికారులు, జేఏసీ ప్రతినిధులు సంతకాలు చేశారు. అనామలీస్ ఉంటే సరిచేసి పేస్కేలు ఫిక్స్ చేయడానికి ఏపీజెన్కో ఎండీ నేతత్వంలో డిస్కంల సీఎండీలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది.
ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్ రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి çషంషేర్ సింగ్ రావత్, ఏపీజెన్కో మేనేజింగ్ డైరెక్టర్ చక్రధర్ బాబు, సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్దన్ రెడ్డి, ట్రాన్స్కో జేఎండీ మల్లారెడ్డి, ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి కుమార్ రెడ్డి, జేఏసీ నేతలు చంద్రశేఖర్, ప్రతాప్ రెడ్డి, సాయికష్ణ, శేషారెడ్డి, శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగులతో చేసిన చర్చలు సఫలం అయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని కోరామని పేర్కొన్నారు. వివిధ అంశాలపై ఒప్పందం కుదిరిందన్నారు. ఎల్లుండి అగ్రిమెంట్ చేస్తామని చెప్పారు. ఫిట్ మెంట్ 8 శాతం ఇచ్చామని పేర్కొన్నారు. ఒకటి రెండు ఇబ్బందులు ఉన్నా వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పారు. గురువారం ఇంజనేర్స్ అసోషియేషన్ వారిని తమ అధికారులు పిలిపించి మాట్లాడతామని చెప్పారు.
వన్ మాన్ కమిటీ సిఫార్సులు అమలు చేసేందుకు ప్రభుత్వం ఇంత వరకూ సమయం తీసుకుందని తెలిపారు. 2018 ప్లస్ పే స్కేల్ ఇచ్చేందుకు అంగీకరించామని విద్యుత్ జేఏసీ కన్వీనర్ సాయి కృష్ణ పేర్కొన్నారు. మాస్టర్ స్కేల్ రూ.2.6 లక్షలు ఇచ్చేందుకు అలాగే 8 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందన్నారు. నోటీసు ఇచ్చిన డిమాండ్ల ప్రకారం కొన్ని పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం చెప్పిన వాటికి అంగీకారం తెలియజేశామని తెలిపారు. అందుకే సమ్మె విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.