అక్టోబర్ 5 కాదు నవంబర్ 2.. ఏపీలో స్కూల్స్ ప్రారంభ తేదీ మరోసారి వాయిదా

ap government schools opening date: ఏపీలో స్కూల్స్ను ప్రారంభించే తేదీ మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 5న ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని భావించిన జగన్ సర్కార్.. మరో నెల రోజుల పాటు ఈ తేదీని వాయిదా వేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల నవంబర్ 2న స్కూళ్లు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
అక్టోబర్ 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా వాయిదా వేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. అయినప్పటికీ అక్టోబర్ 5న పిల్లలకు జగనన్న విద్యా కానుక కిట్లను ప్రభుత్వం అందజేయనుందని తెలిపారు. ఆ రోజు రాష్ట్రంలోని ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనే అవకాశం ఉందని… విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేయనున్నారని మంత్రి చెప్పారు.
ఏపీలో స్కూల్స్ను ప్రారంభించాలని జగన్ సర్కార్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను మరింతగా మెరుగు పరిచేందుకు నాడు నేడు అనే కార్యక్రమం మొదలుపెట్టిన జగన్ సర్కార్.. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తోంది.
పాఠశాలల పునఃప్రారంభానికి ముందే జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఈసారి పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యాకానుకను అమలు చేయాలని నిర్ణయించింది. అందుకే పాఠశాలల పునఃప్రారంభం తేదీ వాయిదా పడినప్పటికీ.. జగనన్న విద్యాకానుకను మాత్రం అక్టోబర్ 5న ప్రారంభించడానికి కసరత్తు చేస్తోంది.